- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
అశ్రునయనాల మధ్య సందీప్ కు వీడ్కోలు...

దిశ, ఘట్కేసర్ : ములుగు జిల్లా, ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లా లంకపల్లి అడవిలో నక్సలైట్లు, పోలీసులు మధ్య జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ తిక్క సందీప్ అంత్యక్రియలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ లో శుక్రవారం ముగిసాయి. జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్, జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, ప్రముఖులు సందీప్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... సందీప్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి ఆర్థిక సాయం తో పాటు, 300 గజాల స్థలం కేటాయిస్తారని, అంతేకాకుండా, సందీప్ భార్యకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా సందీప్ సోదరుడికి కూడా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉపాధి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఆ తర్వాత స్నేహితులు, బంధు మిత్రుల అశ్రునయనాల మధ్య ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో సందీప్ శవయాత్ర నిర్వహించారు. మండల రెవెన్యూ కార్యాలయం సమీపంలో హిందూ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాల ప్రకారం పోలీసులు మూడు సార్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు, ప్రజలు, పోలీసులు పాల్గొన్నారు.