భూ అక్రమ దందా వెనుక నోముల హస్తం ఉంది: తూంకుంట మాజీ సర్పంచ్

by Anjali |
భూ అక్రమ దందా వెనుక నోముల హస్తం ఉంది: తూంకుంట మాజీ సర్పంచ్
X

దిశ, మేడ్చల్ బ్యూరో: కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా ఉంది పరిస్థితి. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో సర్కారు స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని తూంకుంట మాజీ సర్పంచ్ ఎద్దు నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తూంకుంట మున్సిపాలిటీ పరిధి పెద్ద చెరువు ఎఫ్ టీఎల్ సరిహద్దు సర్వే నంబర్ 320, 322, 324లో సుమారు రెండెకరాల స్థలముంది. ఎఫ్టీఎల్ ఆనుకుని ఇదే సర్వే నంబర్ లో నోముల క్రిష్ణారెడ్డి, నోముల మధుసూదన్‌రెడ్డి అన్నదమ్ములకు రెండెకరాల పొలముంది. వీరు తమ రెండెకరాల స్థలంతో పాటు పెద్ద చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ స్థలాన్ని కలుపుకోని మొత్తం నాలుగెకరాల్లో దర్జాగా లే అవుట్ వేశారు. పాత లే అవుట్ పేరిట అమాయక జనానికి ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఈ ఆక్రమ లేవుట్ పై ఫిర్యాదులు రావడంతో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు సంయుక్తంగా ఇటీవల సర్వే చేశారు. లే అవుట్ స్థలంలో ఎఫ్‌టీఎల్ స్థలముందని అధికారులు నిర్దారించి హద్దురాళ్లను పాతారు.

ఎఫ్‌టీఎల్ ఆక్రమించిన నోముల బ్రదర్స్ పై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం, చట్టరీత్యా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. దేవాలయ భూములు సైతం.. తూంకుంట మున్సిపాలిటీలోని వేంకటేశ్వర స్వామి ఆలయంపై నోముల బ్రదర్స్ కన్నేశారు. ఆలయానికి సర్వే నంబర్ 325లోని 1.16ఎకరాలు, 326 సర్వే నంబర్ లో గల 23గుంటల భూమి ఉంది. ఎండో‌మెంట్ భూముల పక్కనే సర్వే నంబర్ 324లో నోముల బ్రదర్స్ కు కొంత స్థలం ఉంది. దీన్నే అదునుగా తీసుకున్న నోముల క్రిష్ణారెడ్డి, నోముల మధుసూదన్ రెడ్డి అన్నదమ్ములు ఆలయ భూములను అక్రమించుకోని ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆలయ స్థలాలను ఒకవైపు ఆక్రమించు కుంటుంటే ఎండో మెంట్ విభాగం రక్షించకపోగా, మున్సిపల్ అధికారులు ఆలయ భూముల్లో భవనాలకు అనుమతులు ఇవ్వడం కొసమెరుపు. తూంకుంట మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ భూ ఆక్రమ, రియల్ ఎస్టేట్ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు.

పెద్ద చెరువు ఎఫ్ టీఎల్, వేంకటేశ్వర స్వామి మాన్యాల ను స్థానికులైన నోముల క్రిష్ణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి అన్నదమ్ములు కబ్జా చేశారు. అందులో ఆక్రమంగా లేవుట్ వేసి, ప్లాట్లను అమాయక జనానికి విక్రయిస్తూ రూ. కోట్లు కొల్లగొడుతున్నరు. అక్రమ లేవుట్‌లో వేసిన రోడ్లు, నిర్మించిన భవనాలను గతంలో మున్సిపల్ అధికారులు కూల్చేశారు. తాజాగా దేవుడి మాన్యంలో నిర్మిస్తున్న భవనాలకు మున్సిపల్ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎఫ్ టీఎల్, దేవాలయ భూములు కాపాడాలి’ అని తూంకుంట మాజీ సర్పంచ్ ఎద్దు నగేష్ వెల్లడించారు.



Next Story

Most Viewed