బీఆర్ఎస్‌ పార్టీకి డబుల్ ట్రబుల్

by Mahesh |
బీఆర్ఎస్‌ పార్టీకి డబుల్ ట్రబుల్
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్‌పల్లి: కంటోన్మెం ట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు డబుల్ సెగ తగిలింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని దివంగత ఎమ్మెల్యే సాయన్న, బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత రూ. కోట్లు వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆందోళనకు దిగారు. శనివారం ఆమె ఇంటి ముందు బైఠాయించారు. వారికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కార్ఖానాలోని నివేదిత నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో నివేదిత ఇంట్లో లేరని సమాచారం. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న నివేదిత ప్రచారంలో భాగంగా బయటకు వెళ్లినట్లు తెలిసింది. అయితే సొంత నియోజకవర్గానికి చెందిన సాయన్న అనుచరులుగా ముద్ర పడిన వారే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బాధితులుగా ధర్నా చేయడం సంచలనం మారింది.

లాస్య నందిత వీడియో వైరల్..

బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన ఉచిత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ లో భారీగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అర్హులైన ప్రతి పేదవాడికి ఎలాంటి పైరవీలు లేకుండా డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్ మాటలకు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఘటనలకు మధ్య.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. గత సర్కారులో అధికార పార్టీ నేతలే ఇళ్ల పంపిణీకి అక్రమ వసూళ్ల దందాకు తెరలేపిన ఘటనలు తెరపైకి వస్తున్నాయి. కంటోన్మెంట్‌ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత వసూళ్ల దందాకు చెందిన ఆడి యో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైరల్‌గా మారింది. వైరలైన ఆ ఆడియో.. మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె దివంగత ఎమ్మెల్యే లాస్య నందితది అని తేలింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలు డబ్బులు తీసుకున్నట్లు ఈ ఆడియో ద్వారా తెలిసింది. అయితే ఇళ్లు రాకపోగా.. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అప్పట్లో ఈ వివాదం జరిగింది.

వీడియోలో ఇలా..

ఈ ఆడియోతో తన తండ్రి సాయన్న పదవిని అడ్డం పెట్టుకుని లాస్య నందిత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ వీడియోలో లాస్య నందిత రూ. 5 లక్షలు తీసుకున్నట్లు అంగీకరించింది. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ఇప్పించ లేనందున మరో రూ.3 లక్షలు వడ్డీ కలుపుకొని రూ.8 లక్షలు ఇవ్వాలని బాధితులు లాస్య నందితను డిమాండ్ చేస్తున్నా డు. అయితే తాను వడ్డీ ఇవ్వలేనని, వడ్డీ ఎలా ఇస్తానని ఆమె అతనితో వాదించింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎవరికైనా ఇప్పించి మీకు ఇవ్వకపోతే తనను అడగాలని, ఇప్పటి వరకు ఎవరికీ చూపించలేదని అందరితో పాటు మీకు వస్తాయని లాస్య నందిత చెబుతోంది. తాజాగా సాయన్న తో సహా ఆమె రెండో కుమార్తె నివేదిత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం రూ.1.46 కోట్లు వసూలు చేసినట్లు బాధితుడి సదానంద్ గౌడ్ ఆరోపించడం, బాధితులు ఆమె ఇంటి వద్ద ఆందోళన చేయడం సంచలనంగా మారింది.

రూ.1.46 లక్షలు వసూళ్లు..?

దివంగత ఎమ్మెల్యే సాయన్న తో పాటు ఆమె కుమార్తె, ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఒక రూ. కోటి 46 లక్షలు వసూలు చేసినట్లు బీఆర్ఎస్ లీడర్ సదా నంద్ గౌడ్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను ఇప్పిస్తామని 30 మంది బాధితుల నుంచి ఒక్కొ బాధితుడి నుంచి రూ.3 నుంచి రూ.5 లక్షలు డబ్బులు తీసుకున్నట్లు ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఒత్తిడి తీసుకురాగా, గతేడాది రూ.12 లక్షలు తిరిగి ఇచ్చారని తెలిపారు. మిగితా రూ. 1.34 కోట్లు ఇవ్వాలని బాధితులందరం ఇంటి చుట్టూ తిరిగినా.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని, నివేదితను అడిగితే మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి జోక్యం చేసు కొని నేను సెటిల్ చేస్తా అంటూ ఆయన కొన్ని రోజులు తిప్పుకున్నాడన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటే ఆశపడి ఇతరుల వద్ద వడ్డీలకు అప్పు చేసి రూ. లక్షల్లో వారి చేతిలో పెట్టామని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని బాధితులు హెచ్చరించారు.



Next Story

Most Viewed