ఏసీబీ వలలో ఇద్దరు రెవెన్యూ అధికారులు

by Disha Web Desk 15 |
ఏసీబీ వలలో ఇద్దరు రెవెన్యూ అధికారులు
X

దిశ, చిన్నశంకరంపేట : లంచం డిమాండ్​ చేసిన ఇద్దరిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న నెల్లి శ్రీహరితోపాటు, అతనికి సహకరించిన చందంపేట గ్రామ వీఆర్ఏ సురేష్ బాబును పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సంగాయిపల్లి గ్రామానికి చెందిన పాపన్నపేట శ్రీనివాస్ గత నెల 5వ తేదీన ఏసీబీ అధికారులకు లంచం విషయమై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. తనకున్న 1313 సర్వే నంబర్ గల భూమిలో కొత్త పాస్ బుక్ నందు 22 గుంటల భూమి తక్కువగా వచ్చినందున రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరిని బాధితుడు శ్రీనివాస్ సంప్రదించగా రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. అంత డబ్బులు చెల్లించలేనని శ్రీనివాస్ తేల్చి చెప్పడంతో బాధితుని భూమి పక్కనే తన స్థలం ఉన్నదని, 18 గజాలు కబ్జాలో ఉన్నట్లు శ్రీహరి పేర్కొన్నాడు.

దాంతో ఆయన అడిగిన రెండు లక్షల రూపాయలతో 18 గజాల డబ్బులు పోగా మిగతావి చెల్లిస్తానని బాధితుడు శ్రీహరికి చెప్పాడు. డబ్బులు చెల్లిస్తాడని ఆశతో పని పూర్తి చేసిన శ్రీహరికి శ్రీనివాస్ పైసలు ఇవ్వలేదు. దాంతో డబ్బుల కోసం బాధితుడిని శ్రీహరి వేధించసాగాడు. ఎట్టకేలకు లక్ష రూపాయలు ఇవ్వాల్సిందిగా ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. లక్ష రూపాయలు సిద్ధం చేసుకుని శ్రీనివాస్ ఏసీబీకి సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు చందంపేట గ్రామ వీఆర్ఏ సురేష్ బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు విచారణ చేసిన అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇప్పటికింకా విచారణ కొనసాగుతూనే ఉందని, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే తదుపరి చర్యలు చేపడతామని డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐలు వెంకట రాజ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed