చేతి తడిపితేనే చెక్కుపై సంతకం!

by Dishanational1 |
చేతి తడిపితేనే చెక్కుపై సంతకం!
X

దిశ, హత్నూర: అది పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గ్రామ పంచాయితీ. కోట్ల రూపాయల నిధులు ఉన్నా...అక్కడ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు జంకుతున్నారు. తాము చేసిన పనుల్లో పర్సంటేజ్ లు ఇచ్చుకొలేక వెనుకడుగు వేస్తున్నారు. తాము చేయించిన పనులకు కమిషన్ అడగటం ఏమిటని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కమిషన్ల పంచాయితీ చూసి నలుగురు నాలుగు రకాలుగా చర్చించుకుంటున్నారు.

ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని గుండ్ల మాచున్నూర్ గ్రామ పంచాయితీ నిధుల ద్వారా చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలో సర్పంచ్ భర్త శశిధర్ రెడ్డి పెత్తనం చెలాయిస్తూ కమిషన్ గూర్చి కాంట్రాక్టర్ ను వేధిస్తున్నారని ఆ గ్రామ ఉప సర్పంచ్ మన్నె శ్రీనివాస్, వార్డు సభ్యుడు సాయమొల్ల శంకర్ లు మండల పంచాయితీ అధికారి సువర్ణను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయితీ సర్వసభ్య సమావేశంలో సభ్యుల తీర్మానం ద్వారా తాము పనులు చేయించగా పి.ఆర్ ఇంజరింగ్ అధికారులు మేజర్మెంట్ చేసి ఎంబీ బుక్ ఇచ్చారని తెలిపారు. ఎంబీ ప్రకారం గ్రామ కార్యదర్శి చెక్ రాసినప్పటికీ, సర్పంచ్ సంతకం చేయకుండా ఆమె భర్త శశిధర్ రెడ్డి అడ్డుంటున్నారని వాపోయారు. కాంట్రాక్టర్ ఇస్తానన్న ఏడు శాతం కమీషన్ ఇవ్వాలని సర్పంచ్ భర్త డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. గ్రామ పంచాయితీ పనుల్లో తల దూరుస్తూ కమీషన్ల కోసం పనులను అడ్డుకుంటున్న సర్పంచ్ భర్తపై విచారణ చేసి చర్య తీసుకోవడంతోపాటు తాము చేయించిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలని వారు కోరారు.

సర్పంచ్ భర్త వివరణ

గ్రామపంచాయతీ వ్యవహారాలలో తలదురుస్తూ కమీషన్ల కోసం అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గుండ్ల మాచునూర్ సర్పంచ్ భర్త శశిధర్ రెడ్డిని దిశ ఫోన్ ద్వారా సంప్రదించగా... గ్రామపంచాయతీ నిధుల నుంచి గుండ్ల మాచు నూర్ లో ఒక కాంట్రాక్టర్ పనులు చేయగా ..వార్డు సభ్యుడు శంకర్ ఎంబీ బుక్ తోపాటు చెక్కు తీసుకుని తమ ఇంటికి రావడంతో చెక్ పై సంతకం పెట్టలేదని సమాధానం ఇచ్చారు. కాంట్రాక్టర్ ద్వారా పంపితే బిల్లులు చెల్లించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ ను 7 శాతం కమీషన్ అడుగుతూ ఒత్తిడి చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలను కొట్టిపారేయడం కొసమెరుపు.


Next Story

Most Viewed