పారిశ్రామిక వాడలో మత్స్యకారులను ప్రత్యేకంగా పరిగణించండి...

by Kalyani |
పారిశ్రామిక వాడలో మత్స్యకారులను ప్రత్యేకంగా పరిగణించండి...
X

దిశ, సంగారెడ్డి బ్యూరో : పటాన్ చెరు పారిశ్రామికవాడలోని ఇస్నాపూర్ గ్రామ మత్స్యకారులను ప్రత్యేకంగా పరిగణించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ కోరారు. గురువారం ఇస్నాపూర్ మత్స్యకార సోదరులతో కలిసి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖని హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి మత్స్యకారుల సమస్య పై వినతిపత్రం అందించారు. అనంతరం ఈనెల 8న జిన్నారం మండలం కొడకంచి ఆదినారాయణ స్వామి జాతర, ఈనెల 21న ఇస్నాపూర్ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలకు హాజరు కావాలని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ… పాశమైలారం పారిశ్రామికవాడలో వెలువడుతున్న కాలుష్యం కారణంగా ఈ ప్రాంతంలో చెరువులు విషపూరితంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థ జలాలు చెరువులో కలవడం వల్ల ఇప్పటికే ఈ ప్రాంతంలో చాలా చెరువులలో చేప పిల్లలు మృత్యువాత పడుతున్నాయన్నారు. ఏ ఏ పరిశ్రమల ద్వారా చెరువులకు నష్టం జరుగుతుందన్న విషయాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా విచారణ జరిపి నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని చెరువుల్లో కాలుష్యం వల్ల చేపల పెంపకానికి అనువుగా లేకపోవడంతో ఇక్కడ మత్స్యకార సభ్యులకు సొసైటీలో సభ్యత్వం కల్పించే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన వాపోయారు. దీంతో ఇక్కడ మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలలో అర్హత సాధించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పాశమైలారం పారిశ్రామికవాడలో నెలకొన్న ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇస్నాపూర్ మత్స్యకారులను ప్రత్యేకంగా గుర్తించి జిల్లా మత్స్యకార సహకార సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలని, పరిశ్రమల నుంచి ప్రతి సంవత్సరం నష్టపరిహారం ఇప్పించాలని ఆయన మంత్రిని కోరారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన మంత్రి కొండా సురేఖ సంబంధిత విజ్ఞప్తి పత్రంపై వెంటనే సంతకం చేసి పీసీబీ అధికారులకు విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలిచ్చారు. పారిశ్రామిక వాడలో నీ మత్స్యకారులకు న్యాయం జరిగే విధంగా శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిన్నారం బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దాసరి శ్రీకాంత్ రెడ్డి, జిన్నారం, గుమ్మడిదల మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ, నర్సింగ్ రావు, ప్రతాప్ రెడ్డి,మాణిక్ రావు, నారబోయిన శ్రీనివాస్, వీర్నాల సత్యనారాయణ, సుంకర బోయిన మహేష్,కొడకంచి ఆలయ అర్చకులు, ఇస్నాపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మన్నే రాఘవేందర్, ఉళ్ళ శంకర్, ప్యాట నర్సింలు,యాదగిరి, పెంటయ్య, గోపాల్,రాజు, సోములు, మనోహర్, దశరథ్,రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Next Story