నిరాదరణకు గురైన పట్టణ పార్కులు

by Sumithra |
నిరాదరణకు గురైన పట్టణ పార్కులు
X

దిశ, సంగారెడ్డి : అధికారుల నిర్లక్ష్యం పట్టణ ప్రకృతి వనాలు నిరాదరణకు గురవుతున్నాయి. ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు గత ప్రభుత్వం ప్రతి వార్డులో ఓ పట్టణ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో సుమారు 30 వార్డులో పట్టణ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. పట్టణ ప్రకృతి వనాలు ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడంతో పాటు వాకింగ్, వ్యాయామాలు చేసుకునేందుకు ఉపయోగపడతాయి. అదే విధంగా పచ్చని చెట్లతో ప్రజల ఆరోగ్యాలకు ఉపయోగపడే ఆక్సిజన్ అందించేందుకు చెట్లను నాటారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో వృక్షాలను పెంచాలని ప్రజలకు విశ్రాంతి అందించాలని ప్రకృతి వనాలను ప్రారంభించింది.

కానీ అక్కడి స్థితిని చూస్తే, కేవలం పేపర్లకే పరిమితమైందనిపిస్తుంది. పచ్చదనం కోసం ఆరాటపడే ప్రజలు సేదతీరేందుకు నాటిన మొక్కలు ఎండిపోయిన పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మున్సిపల్ అధికారులు పట్టణ ప్రకృతి వనాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాలు ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడం లేదు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనంలో నాటిన మొక్కలకు నీరు పోయకపోవడం ఎండిపోతున్నాయి. అదే విధంగా పార్కుల్లో చెత్తాచెదారం నిండిపోయి డంపింగ్ యార్డుగా దర్శనమిస్తున్నాయి. అయినా అందులో క్లీన్ చేయడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ప్రజలకు వనాలు ఆహ్లాదాన్ని అందించకపోగా అందులో వెళ్లి సేదదీరే అవకాశం లేకుండా పోయింది.

పట్టించుకోని మున్సిపల్ అధికారులు..

పట్టణ ప్రకృతి వనాలలో మొదట్లో చిన్నారులు ఆడుకునేందుకు వస్తువులు, పెద్దలు వాకింగ్ చేయడానికి నడకదారి ఏర్పాటు చేశారు. సాయంత్రం సమయంలో ఈ పార్కులు కళకళలాడేవి. ముసలివారు కొంత సేపు సేదతీరే వారు, మరికొందరు యోగాసనాలు చేసుకునేవారు. కానీ ఇవి అధికారుల నిర్లక్ష్యం వల్ల వనం కాదు, చెత్త పోసే స్థలం అయిపోయిందని స్థానికులు అంటున్నారు. ఇంకొంతమంది యువత అక్కడ ఫోటో షూట్ కి వచ్చి చెత్త పారేసి వెళ్తుంటారు. అడవిని కాక, చెత్తకుప్పను గుర్తుచేసేలా మారిన ఈ ప్రకృతి వనాల పరిస్థితిని చూసిన వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆ వనంలో నీడ లేదు. చెట్టు కింద నీరేసే మనుషులు లేకపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. గత ప్రభుత్వం గొప్ప ఆశయంతో మొదలు పెట్టిన పట్టణ ప్రకృతి వనాలు పట్టించుకునేవారు లేక బోరు మంటున్నాయి. ఇప్పటికైనా పట్టణ ప్రకృతి వనాలను బాగు చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వేసవిలో చల్లని గాలికి వచ్చి సేద తీరాలని ఆరాటపడే ప్రజలకు పట్టణ ప్రకృతి వనాలలో ఎండిపోయిన చెట్టు, చిన్న పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు విరిగిపోయి దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని పట్టణ ప్రకృతి వనాలకు పూర్వవైభవం తీసుకురావాలని, పార్కుల్లో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి ఆహ్లాదాన్ని అందించేలా తయారు చేయాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed