జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్సీ కవిత

by Disha Web Desk 13 |
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్సీ కవిత
X

దిశ, అమీన్ పూర్: జర్నలిస్ట్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నిజామాబాద్ ఎమ్మెల్సీ, జాగృతి జాతీయ అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆదివారం పటాన్ చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన టీయుడబ్ల్యూజే ద్వితీయ మహాసభల్లో కవిత, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌లు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ద్వితీయ మహాసభలు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పదవ ప్లీనరీ సమావేశాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత జ్యోతిప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ ప్రెస్ అకాడమీ ఏర్పాటు చేసి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పత్రికలు మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చెందుతున్నాయి అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను, ముఖ్యంగా ఇళ్ల స్థలాల విషయంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా చూస్తానని కవిత తెలిపారు. దేశం నలుమూలల నుంచి హైదరాబాద్ మహా నగరానికి విచ్చేసిన జర్నలిస్ట్ నాయకులకు ఈ సందర్భంగా ఆమె స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని పేర్కొంటూ.. యాదాద్రి దేవాలయాన్ని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన జర్నలిస్ట్ ప్రతినిధులు ప్రత్యేకంగా దర్శించుకోవాలని ఆమె కోరారు. ఇందుకు అవసరమైతే వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున బస్సులను ఏర్పాటు చేస్తామని సూచించారు.


మూడు రోజులపాటు జరిగే సభల్లో కాస్త సమయం తీసుకుని యాదాద్రి దేవాలయాన్ని దర్శించుకోవాలని ఆమె కోరారు. మహాసభలు జాతీయ ప్లీనరీ సభలు నగరంలో జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు స్థానిక ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, నాయకులు, ఆయా రాష్ట్రాల జర్నలిస్టు ప్రతినిధులు, జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు.



Next Story