మోదీ సభకు చక చక ఏర్పాట్లు..

by Naresh N |
మోదీ సభకు చక చక ఏర్పాట్లు..
X

దిశ, పటాన్ చెరు: ఈనెల 5న సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు సంబంధించిన ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ శివారులోని ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ప్రాంగణం ఈ సభకు వేదిక కానుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న అధికారిక కార్యక్రమాలు కావడంతో అధికార యంత్రాంగం, రాష్ట్ర బీజేపీ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ సభను పార్టీ మైలేజ్ కోసం వాడుకుని రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆలోచిస్తుంది. అన్ని పార్టీల కంటే ముందే 9 స్థానాలకు లోక్ సభ అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న బీజేపీ ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయడం ద్వారా ఎన్నికల శంఖారావం పూరించి ప్రత్యర్థి పార్టీల కంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయనుంది.

ఈ నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి సభ ప్రాంగణంలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ సభను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. వేసవి కాలం కావడంతో సభకు వచ్చిన జనం ఎటువంటి ఇబ్బందులు పడకుండా భారీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. సభ ప్రాంగణంలో భారీ వేదిక నిర్మాణంతో పాటు వేదికకు రెండు వైపులా జనం కూర్చోవడానికి అనువుగా సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో పాటు ముఖ్య నేతలు, అధికారులతో సమావేశానికి అనుకూలంగా ఉండడానికి సభ వేదిక వెనుక మరొక ప్రాంగణాన్ని నిర్మిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి అన్ని శాఖల అధికారులతో సంప్రదింపులు చేస్తూ సభ కోసం కావాల్సిన ఏర్పాట్లను చూసుకుంటున్నారు. మోదీ రాక కోసం సభ ప్రాంగణంలోనే రెండు హెలిప్యాడ్‌లను సిద్ధం చేశారు. భద్రత అధికారుల పర్యవేక్షణలో వారి సూచనలకు అనుగుణంగా సభ ప్రాంగణం ఏర్పాట్లు చేస్తున్నారు.



ఇప్పటికే సభ ప్రాంగణాన్ని కేంద్ర బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ప్రధాని భద్రత అధికారుల ఆదేశాల కనుగుణంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ భద్రత చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలకు ముందు సంగారెడ్డి జిల్లాలో మోడీ సభ జరగడం తమ అదృష్టంగా భావిస్తున్న బీజేపీ నాయకులు సభను కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేయడానికి సన్నాహాలు సుకుంటున్నారు. మోడీ సభతో మెదక్ పార్లమెంట్ లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed