అమ్రాబాద్ మండలంలో ఏప్రిల్ 23న వాటర్ షెడ్ యాత్ర

by Kalyani |
అమ్రాబాద్ మండలంలో ఏప్రిల్ 23న వాటర్ షెడ్ యాత్ర
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలంలో ఉప్పునుంతల, బి కే లక్ష్మాపూర్ గ్రామాలలో ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పథకంలో భాగంగా ఈనెల 23న వాటర్ షెడ్ యాత్ర చేపడుతున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయం తెలిపారు. అందుకు సంబంధించి మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో వాటర్ షెడ్ యాత్రపై సంబంధిత శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) దేవ సహాయం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఎంపీలతో పాటు జిల్లా కలెక్టర్ పాల్గొంటారని కావున వాటర్ షెడ్ యాత్రలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వాటర్ షెడ్ లు మన నీటి వనరులకు, పర్యావరణానికి కీలకమైనవని, వాటిని సమర్థవంతంగా నిర్వహించడం చాలా ముఖ్యమని, వాటర్ షెడ్ ల ప్రాముఖ్యతను, వాటిని పరిరక్షించడానికి తీసుకోవలసిన చర్యలను అధికారులకు వివరించారు.

ప్రజల్లో అవగాహన...

ఏప్రిల్ 23వ తేదీన వాటర్ షెడ్ పథకంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. భూ సంరక్షణ, నీటి సంరక్షణ, గ్రామీణ ప్రజల జీవనోపాధి మెరుగు కోసం ఉద్దేశించిన వ్యవసాయ సంబంధమైన పండ్ల తోటల పెంపకం, అధునాతన సాంకేతిక వ్యవసాయ పద్ధతి ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి ప్రజల్లో విస్తృత అవగాహన పెంపొందించనున్నట్లు వివరించారు. అటవీ సంరక్షణ లో భాగంగా వాటర్ షెడ్ ప్రాంతాల్లో చెట్లను నరకకుండా చూడాలని, కొత్త మొక్కలను నాటాలని, నేల కోతను నివారించడానికి సరైన వ్యవసాయ పద్ధతులను, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడా లని, వర్షపు నీటిని సంరక్షించుకొని భవిష్యత్తు తరాలకు అందించాలన్న ముఖ్య లక్ష్యంతో, పర్యావరణ పరిరక్షణ కొరకై చేపట్టనున్న వాటర్ షెడ్ యాత్రను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

విద్యార్థులలో భాగస్వామి చేయాలి..

వాటర్ షెడ్ యాత్రలో విద్యార్థినీ విద్యార్థులను, యువకులను, ప్రజలను, ప్రజాప్రతినిధులను, అధికారులను భాగస్వామ్యం అయ్యేటట్లు చూడాలని సూచించారు. విద్యాధికారులు పాఠశాలల్లో వాటర్ షెడ్ పథకంపై వ్యాసరచన ఉపన్యాస చిత్రలేఖన పోటీలు నిర్వహించాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు వాటర్ షెడ్ యాత్ర పై స్టాళ్లను, ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటే కార్యక్రమం, చెక్ డ్యామ్ నిర్మాణం కొరకు భూమి పూజ, తదితర పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. వాటర్ షెడ్ నిర్వహణలో స్థానిక ప్రజలు చురుగ్గా పాల్గొనాలి తెలియజేశారు. ఈ సమీక్షా సమావేశంలో డిఆర్ డిఏ పిడి చిన్న ఓబులేసు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి రామ్మోహన్రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed