ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం: కలెక్టర్ వెంకట్రావు

by Disha Web Desk 11 |
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం: కలెక్టర్ వెంకట్రావు
X

దిశ, మహబూబ్ నగర్: ప్రజాసామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధం లాంటిదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు సూచించారు. 13 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి పట్టణంలోని జిల్లా పరిషత్ వరకు ఏర్పాటు చేసిన మోటార్ బైక్ ర్యాలీని ప్రారంభించి, స్వయంగా ఆయన బైక్ నడుపుతూ జిల్లా పరిషత్ చేరుకుని మాట్లాడారు. భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్యంలో నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య ఎన్నికలను ప్రపంచ దేశాలన్నీ పరిశీలిస్తున్నాయని, ఇది ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అన్నారు.

ఓటరు అవగాహన, ఓటరు శాతాన్ని పెంచేందుకుగాను కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఎప్పటికప్పుడు ఎన్నికలలో అనేక సంస్కరణలను, కొత్త విధానాలను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని, కొత్త ఆలోచనలను స్వీప్ కార్యక్రమాల ద్వారా తీసుకొస్తున్నాయని తెలిపారు. గతంలో కేవలం 45 శాతం మాత్రమే ఉన్న ఓటింగ్ శాతం, ఇప్పుడు 85నుంచి 90 శాతం వరకు పెరిగిందని అన్నారు. గతంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు సంవత్సరంలో నాలుగు సార్లు ఓటరుగా నమోదు చేసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించిందని, అంతేకాక 18 సంవత్సరాలు నిండినవారు ఆన్ లైన్ ద్వారా ఎప్పుడైనా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

ఈవీఎంలు ప్రవేశ పెట్టడంతో ఓట్ల లెక్కింపు ఎంతో సులభతరమై, సమయం కూడా ఆదా అవుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో 6 లక్షల 47 వేల 384 మంది ఓటర్లు ఉన్నారని, వీరందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే బాధ్యత ఉందని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాక్ పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామరావు మాట్లాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ 80 సంవత్సరాలు పైబడి, ఓటు హక్కు కలిగిన సీనియర్ సిటిజన్లను సన్మానించారు. కొత్త ఓటరుగా నమోదైన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో అనిల్ కుమార్, జడ్పీ సీఈఓ జ్యోతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Next Story