ఘనంగా ప్రారంభమైన జంగంరెడ్డిపల్లి జాతర ఉత్సవాలు..

by Disha Web Desk 6 |
ఘనంగా ప్రారంభమైన జంగంరెడ్డిపల్లి జాతర ఉత్సవాలు..
X

దిశ, మహమ్మదాబాద్: గండీడు మండల పరిధిలోని జంగంరెడ్డిపల్లిలో జాతర ఉత్సవాలను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. జంగంరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో నిర్వహించడం సాంప్రదాయం. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. శుక్రవారం ఉదయం గణపతి పూజ, పుణ్యావాచనంతో బ్రహ్మోత్సవాలను ఆరంభించారు. ఈనెల 3, 4, 5, 6 తేదీలలో బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి స్వామివారి ఎదుర్కొళ్ల కార్యక్రమం నిర్వహించనున్నారు. శనివారం స్వామివారి కళ్యాణం అనంతరం అఖండ భజన, ఆదివారం తెల్లవారుజామున రథోత్సవం నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ జాతర మహోత్సవానికి మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, కర్ణాటక రాష్ట్ర, జిల్లాల నుంచి ప్రజలు వచ్చి తమ మొక్కలను చెల్లించుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు.


Next Story