రెండు రోజుల్లో బ్యాంకు, క్యాష్, క్రెడిట్ రికార్డులను సబ్మిట్ చేయాలి

by Disha Web Desk 11 |
రెండు రోజుల్లో బ్యాంకు, క్యాష్, క్రెడిట్ రికార్డులను సబ్మిట్ చేయాలి
X

దిశ, గద్వాల టౌన్ : ఎన్నికల పోటీలో నిలబడ్డ అభ్యర్థులు, ఖర్చులకు సంబంధించిన బ్యాంకు, క్యాష్, క్రెడిట్ రికార్డులను రెండు రోజుల్లో సబ్ మిట్ చేయాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్ కుమార్ ఝ ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాలులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్ కుమార్ ఝ తొలి పరిశీలనా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్వాల అసెంబ్లీ ఎన్నికల పోటీలో నిలబడ్డ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులకు సంబంధించిన రిజిష్టర్లను ఆయన తనిఖీ చేశారు. బీఆర్ఎస్, ఐఎన్ సీ, బీజేపీ, ఏఐఎఫ్ బీ పార్టీల ప్రతినిధులు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల రికార్డులను పరిశీలించి, రిజిష్టర్ లలో అన్ని ఖర్చుల నమోదు తప్పనిసరి అని అన్నారు.

ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన రాజయకీయ ప్రతినిధులతో ఎన్నికల వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ, సభలు, సమావేశాలు, ప్రచారానికి సంబంధించిన క్యాప్ లు, ఖండువాలు, జెండాలు, ప్రచురణ కరపత్రాలు, కుర్చీలు, పూల దండలు, టీ కాఫీ, బిస్కట్స్ వంటి వాటి లెక్కలు వారిని అడిగి తెలుసుకున్నారు. నగదుకు సంబంధించిన లెక్కలు ప్రత్యేక రిజిష్టర్ లో నమోదు చేయాలని, చెక్ డిపాజిట్ లు, విత్ డ్రాలకు మరో రిజిష్టర్ ఉండాలన్నారు. రిటర్నింగ్ అధికారి సంతకంతో నామినేషన్ సమయంలో అభ్యర్థులకు అందించిన ఏ, బీ, సీ రిజిష్టర్లలో ఎన్నికల ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అన్నారు. ఈ సమావేశానికి జిల్లా ఉద్యానవన అధికారి అక్బర్, ఎన్నికల వ్యయ అధికారులు విజయ భాస్కర్, నారాయణ, వివిధ రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story