‘కేసీఆర్ వారసుడిగా హరీష్ రావును ప్రకటించాలి.. కేటీఆర్ అయితే జరిగేది ఇదే’

by Disha Web Desk 2 |
‘కేసీఆర్ వారసుడిగా హరీష్ రావును ప్రకటించాలి.. కేటీఆర్ అయితే జరిగేది ఇదే’
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్‌పై కాంగ్రెస్ కీలక నేత, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో కోమటిరెడ్డి చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వారసుడిగా హరీష్ రావును ప్రకటించాలని సూచించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హరీష్ రావును నియమిస్తేనే ఆ పార్టీ బతుకుతుందని అన్నారు. ఒకవేళ కేటీఆర్‌ను నియమిస్తే ఆ పార్టీలో ఒక్కరు కూడా మిగలరని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదని అన్నారు. ఐదేళ్ల వరకు ప్రభుత్వాన్ని ఎవరూ టచ్ చేయలేరని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా కృష్ణా జలాల అంశంపై చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే.

ఈ అంశంపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పక్షాల పరస్పర విమర్శలతో తెలంగాణ‌లో పొలిటికల్ హీట్ పెరిగింది. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు ధీటుగా సమాధానాలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటిసారి హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. ఆ అనుభవంతో ప్రతి ఆరోపణకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావునే కేసీఆర్ వారసుడిగా ప్రకటించాలని స్వయంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే డిమాండ్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల భిన్నంగా స్పందిస్తున్నారు.


Next Story