- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అడవి బిడ్డలు ఇకపై అన్నదాతలు : మంత్రి హరీష్ రావు వెల్లడి

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : ఏళ్ల తరబడి పోడు భూముల పట్టాల కోసం ఎదురుచూస్తున్న అడవి బిడ్డలు నేడు అన్నదాతలుగా మారనున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా పాల్వంచలోని సుగుణ గార్డెన్స్ వేదికగా శుక్రవారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రమంతా పండగ వాతావరణంలో జరుగుతుందని అన్నారు. నిన్న మొన్నటి వరకు అటవీ అధికారులు ఏ క్షణంలో దాడి చేస్తారో, ఏ క్షణాన భూములు లాక్కుంటారో అన్న భయం గుప్పట్లో బతికిన పోడు రైతులు నేటి నుండి భూమిపైన పూర్తి హక్కులు పొందుతున్నారని అన్నారు. రాష్ట్రం మొత్తంలో నాలుగు లక్షల ఆరు వేల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేస్తుంటే ఒక్క కొత్తగూడెం జిల్లాలోనే లక్ష 50 వేల ఎకరాలకు పట్టాలు అందించనున్నామని తెలిపారు. 55 వేల రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు ఎకరాలు చొప్పున పట్టాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
పోడు భూమి పట్టాతో పాటు 10 రకాల ప్రయోజనాలు పొందబోతున్నట్లు తెలిపారు. పట్టాతోపాటు రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, దురదృష్టవశాత్తు ఏ రైతు మరణానికి గురైనా 5 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించనున్నట్టు చెప్పారు. పోడు వ్యవహారం పై పెట్టిన కేసులన్నీ ఎత్తి వేయడానికి కృషి చేయడంతో పాటు భూమిపై వారసత్వ హక్కు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ పోడు భూముల పట్టాల పంపిణీ చేసే సమయానికి జిల్లా నుండి మంత్రిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అడవి బిడ్డల గోస ఎరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారి సాధక బాధకాలను అర్థం చేసుకొని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనే సంకల్పంతో అమలు చేసినట్టు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్ష యాభై వేల ఎకరాలను 50 వేల 595 మంది పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ గిరిజనులకు, గోండులకు, కోయబిడ్డల తండాలను గ్రామపంచాయతీలుగా చేస్తానని మాట ఇచ్చి 3వేల పైచిలుకు గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసి ఆ గ్రామాలకు వారినే ప్రజా ప్రతినిధులుగా చేసిన ఘనత కేవలం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ తరతరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చిన కేసీఆర్ పోడు భూముల సమస్యను పెద్ద మనసుతో పరిష్కరించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది లబ్ధిదారులకు పోడు పట్టాలు అందిస్తున్నట్లు తెలిపారు.హైదరాబాద్ జూబ్లీహిల్స్ ,బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఆదివాసి గిరిజన బిడ్డలకు విలువైన స్థలాలు కేటాయించి భవన నిర్మాణాలు చేయించిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చ నాగేశ్వరరావు, హరిప్రియ, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు, పోడు లబ్ధిదారులు పాల్గొన్నారు.