పోడు భూములకు ప్రభుత్వ సదుపాయాలు కల్పిస్తాం

by Sridhar Babu |
పోడు భూములకు ప్రభుత్వ సదుపాయాలు కల్పిస్తాం
X

దిశ, అశ్వారావుపేట : పోడు సాగుదారులకు హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వం నుండి అన్ని సదుపాయాలను వర్తింపజేయాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో 5546 ఎకరాలకు గాను 1557 మంది పోడు రైతులకు మంజూరైన పట్టా పాసు పుస్తకాలను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆదివారం పంపిణీ చేశారు. కన్నాయిగూడెం, కావడిగుండ్ల, గుమ్మడవల్లి, కోయరంగాపురం, నందిపాడు, దిబ్బగూడెం, మొద్దులమడ, కొత్తమామిళ్లవారిగూడెం, తిరుమలకుంట, పాత రెడ్డిగూడెం గ్రామాల్లో పాసు పుస్తకాల పంపిణీలో భాగంగా సుడిగాలి పర్యటన చేపట్టిన

ఎమ్మెల్యే మెచ్చాకు పోడు రైతులు ఘన స్వాగతం పలికారు. కన్నాయిగూడెంలో పోడు భూమిలో దుక్కి దున్నుతున్న రైతుల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే మెచ్చా పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ.. పోడు సాగుదారులకు హక్కులు కల్పించడంలో సీఎం కేసీఆర్ కృషి ఎనలేనిదన్నారు. రాజకీయ లబ్ధి కోసం పోడు పట్టాలివ్వాలంటూ మొసలి కన్నీరు కార్చిన విపక్షాలు ఇప్పుడు ఏమని విమర్శిస్తాయని ప్రశ్నించారు. మొదటి విడతలో పాస్ పుస్తకాలు రానివారి గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందన్నారు. అలాంటి వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అర్హులైన అందరికీ పాస్ పుస్తకాలు వస్తాయని తెలిపారు.



Next Story

Most Viewed