పేదలకు ఇస్తే అన్యాయం.. మీరు దోచుకుంటే న్యాయమా..?

by Sumithra |
పేదలకు ఇస్తే అన్యాయం.. మీరు దోచుకుంటే న్యాయమా..?
X

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో రూ. 37 కోట్ల 72 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆరు విద్యుత్ సబ్ స్టేషన్ ల శంకుస్థాపన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం బాలరాజులతో కలసి స్థానిక పామాయిల్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన ప్రజా సభలో పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను పీల్చి పిప్పి చేసింది : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

దొరల పాలన కోసం దోపిడీ దారులు ఏకమవుతున్నారని, తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్తని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నువ్వు.. నీ కుటుంబం.. నీ పార్టీ రాష్ట్ర సంపదను దోచుకుంటే న్యాయమా ? రాష్ట్ర సంపదను నాలుగు కోట్ల ప్రజలకు పంచాలని ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపట్టడం అన్యాయమా ? అని బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు. ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి దోపిడీ చేయడానికి మేము అధికారంలోకి రాలేదన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నామని తెలిపారు. ఏ ఒక్క రైతు సోదరుడు గాని, విద్యుత్ వినియోగదారుడు ఇబ్బంది పడకూడదని ఎమ్మెల్యే జారే విజ్ఞప్తితో అశ్వారావుపేటలో 6 సబ్ స్టేషన్ లు మంజూరు చేశాం అని తెలిపారు. ఒకే నియోజకవర్గంలో ఒకేసారి రూ. 40 కోట్లతో 6 సబ్ స్టేషన్ లు మంజూరు చేయడం స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పట్టుదల వల్లే జరిగిందన్నారు.

పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేసింది. అడ్డగోలుగా సంపాదించిన డబ్బు ఫామ్ హౌస్ నుంచి ఖర్చు పెడుతూ సభలు పెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడతారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్లు తెచ్చి గోదావరిలో పోశారని ఎద్దేవా చేశారు. రూ.7 లక్షల కోట్లు అప్పు మా మీద పడేశారు. అలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఒకేసారి మంజూరు చేసుకున్నామన్నారు. పదేళ్ళలో ఒక్క సారైనా గ్రూప్ వన్ పరీక్ష పెట్టారా..? ఏడాదిలో 57 వేల ఉద్యోగాలు ఇచ్చాం, మరో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చే పనిలో ఉన్నాం. రూ. 9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాస్ ద్వారా నిరుద్యోగులకు ఆసరా కల్పిస్తున్నామన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకం ఆపలేదు. ఇంకా పెంచి పథకాలు అమలు చేశామన్నారు. ధనిక రాష్ట్రాన్ని దివాళా తీసిన నీకు పదేళ్లలో సన్న బియ్యం ఇచ్చే సోయి లేనోళ్లు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 90 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పథకం ప్రవేశ పెట్టామన్నారు.

మీ పదేళ్ల పాలనలో గిరిజన నియోజక వర్గాల్లో అటవీ పట్టా భూముల సాగు విషయంలో మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టారు. రూ. 12,500 కోట్ల నిధులతో గిరిజనులు వ్యవసాయం కోసం ఇందిర గిరి జల వికాస్ పథకాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి ఎన్నికల హామీ నిలబెట్టుకుని పేదల కళ్ళలో ఆనందం చూస్తున్నాం. పేదలకు మంచి చేయడానికి కేబినెట్ మొత్తం సంక్షేమ పథకాలు రూపకల్పన చేస్తున్నామన్నారు. పేదలకు సాయం చేయడానికి కేసీఆర్, కేటీఆర్, అల్లుడికి మనసు రాలేదు. వైయస్సార్ ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ నీ మీరు మూలకు పడేశారు. మేము విద్య పరిమితిని రూ.10 లక్షలకు పెంచి రూ. 90 లక్షల కుటుంబాలకు ఉచిత వైద్యం అందిస్తున్నాం.

స్త్రీ లకు ఉచిత బస్ ప్రయాణాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఉచిత బస్ పథకం ఆపేయాలని కేసీఆర్ అంటున్నాడు. పోషకాహారం ఇవ్వాల్సిన హాస్టల్స్ విషయంలో పదేళ్ల కేసీఆర్ పట్టించుకోలేదు. మేము అధికారంలోకి రాగానే డైట్ చార్జీలు 40% కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంచాం. ప్రతి విద్యార్థి ప్రపంచంతో పోటీపడేలా ఉండాలని ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాలకు తగ్గకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తామన్నారు. పదేళ్లు రాష్ట్ర సంపద మొత్తం దోచుకుని వరంగల్ సభలో కేసీఆర్ కాంగ్రెస్ మీద బురద చల్లుతున్నారు. ఇందిరా క్రాంతి ద్వారా రూ. 21 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చి ప్రతి మహిళ తలెత్తుకుని బతికేల చేస్తాం. రాష్ట్ర సంపద నాలుగు కోట్ల ప్రజలకి పంచుతాం తప్ప కేసీఆర్ మాదిరి దోచుకోము, మన ప్రజా ప్రభుత్వం లో మెరుగైన పాలన చేసుకుందామన్నారు.

తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అశ్వారావుపేట నియోజకవర్గం కొన్ని దశాబ్దాల కాలంగా వెనుకబడి ఉంది. అలాంటి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి చొరవతో కరెంట్ వెలుగులు నింపేందుకు విద్యుత్ సబ్ స్టేషన్ ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకుంటున్నాం అన్నారు. వైఎస్సార్ హయాంలో ప్రతీ తండాకు, ప్రతి గ్రామానికి నాణ్యమైన కరెంట్ తో పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నాణ్యమైన కరెంట్ ఇచ్చేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎనిమిదో అద్భుతం కాళేశ్వరం కడుతున్నాం అని చెప్పి రాష్ట్రాన్ని దోచుకున్న ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర సంక్షేమాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. అలాంటి వాటన్నిటిని తట్టుకుని వారు చేసిన తప్పిదాలను సరిచేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. ఎవరికీ ఉపయోగపడని ధరణిని పక్కన పెట్టి ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడేలా భూ భారతి చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చాం.. విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నాం. నిరుద్యోగ యువతకు ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే రూ.50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చామన్నారు. రాజీవ్ యువ వికాస్ పేరుతో త్వరలోనే ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పించేందుకు లోన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో కోళ్ల ఫారాల్లో, పాడుబడిన రైస్ మిల్లుల్లో ఉన్న గురుకులను పక్కన పెట్టీ ఇంటిగ్రేటెడ్ గురుకులాల పేరుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వేల కోట్ల రూపాయలతో గురుకులాల ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకున్నారన్నారు. హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలు పెంచాం. మనసుంటే మార్గం ఉంటుంది. పేదవాడి కళ్లలో చిరునవ్వు చూడాలని కాస్త ఇబ్బందులు ఎదురు అయినా ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం.

కచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం రైతుని రాజును చేశాం. రుణమాఫీని సక్రమంగా అమలు చేశాం, రైతు బంధు ఇచ్చాం. వర్షాకాలంలో సన్నాలకి బోనస్ ఇచ్చాం. యాసంగిలో కూడా ఇస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ. 8 లక్షల 19 వేల కోట్ల రూపాయలకు మన ప్రభుత్వం ప్రతీ నెల రూ.6500 కోట్లు అస్సలు, మిత్తి కడుతూ వస్తున్నాం. పేదవాడికి ఏది ముందు అవసరమో అది ఇస్తున్నాం. మొదటి విడతలో ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 4.50లక్షల ఇళ్లు ఇస్తామన్నారు. ఐటీడీఎ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో కోటా కంటే ఎక్కువ ఇళ్లు కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. గత ప్రభుత్వం చేసింది గోరంత చెప్పుకున్నది కొండంత మనం కొండంత చేసి గోరంత చెప్పుకుంటున్నాం. ఐ అండ్ పీఆర్ ద్వారా రూ.1052 కోట్ల రూపాయలను అసత్యపు ప్రచారానికి గత బీఆర్ఎస్ పాలకులు అక్రమంగా వినియోగించుకున్నారు. పదిహేను, పదహారు నెలల నుంచి ఏ విధమైన పాలనను మన ప్రభుత్వం అందిస్తుందో రాబోయే మూడున్నర సంవత్సరాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అదే విధమైన మంచి సుపరిపాలన అందిస్తారని గర్భంగా చెబుతున్నానన్నారు.



Next Story

Most Viewed