ఉద్యమ కెరటాలు కొత్తగూడెం ప్రజలు : సీఎం కేసీఆర్​...నూతన కలెక్టరేట్, జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

by Sridhar Babu |

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : తెలంగాణ ఉద్యమ సమయంలో అక్రమ అరెస్టులకు పాల్పడి ఖమ్మం జైలుకు తనను తరలిస్తే జిల్లా ప్రజలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఉద్యమ గళాన్ని ఢిల్లీకి వినిపించడంలో కీలకపాత్ర పోషించారని సీఎం కేసీఆర్​ కొనియాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేఎస్ఎం వద్ద నిర్మించిన నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా నూతన కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు చక్కటి పాలన సౌలభ్యం అందించడానికి విశాలమైన సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మించినట్టు తెలిపారు. జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని, ఇక్కడ నూతనంగా మెడికల్ కళాశాల నిర్మించి వైద్య విద్యని చేరువచేశామని అన్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల ప్రజలు ఎంతో చైతన్యవంతులని, కమ్యూనిస్టు భావాలు ఎక్కువగా ఉన్న జిల్లా అని కొనియాడారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కోరిక మేరకు ముర్రేడు వాగు కరకట్ట నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కొత్తగూడెం,పాల్వంచ మున్సిపాలిటీల అభివృద్ధి పనులకు ఒక్కొక్క మున్సిపాలిటీకి 40 కోట్ల రూపాయల చొప్పున 80 కోట్లు అందిస్తామని అన్నారు. మణుగూరు, ఇల్లందు మున్సిపాలిటీలకు 25 కోట్ల రూపాయల చొప్పున 50 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.

విలేకరులకు సాధ్యమైనంత త్వరగా ఇళ్ల స్థలాలు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా కలెక్టర్​కు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే 33 జిల్లాలలో మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామని తెలిపారు. కేసీఆర్ కిట్ వెనక ఉన్నది మానవీయ కోనమని, భవిష్యత్ తరాలు బలహీన పడకుండా చేసే మహోద్యమమని తెలిపారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలో ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని పేర్కొన్నారు. ఎక్కడా లేని విధంగా 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతూ విభజించి పాలించే విధంగా కేంద్ర ప్రభుత్వం తమ పరిపాలన సాగిస్తుందని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాల వల్ల అనేక రాష్ట్రాలు ఆర్థికంగా బలహీన పడుతున్నాయని మండిపడ్డారు. అనంతరం రామాంజనేయ కాలనీ వద్ద నిర్మించిన నూతన జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు నామ ,వద్దిరాజు రవిచంద్ర , పార్థసారధి రెడ్డి ,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ డాక్టర్.వినీత్, జిల్లా ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు పల్లా, తాత మధు, మాజీ మంత్రి తుమ్మల, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed