- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వాడల్లో తిరుగుతూ...సమస్యలు తెలుసుకుంటూ...

దిశ, ఖమ్మం సిటీ : వాడ వాడన పువ్వాడ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలోని 29, 30వ డివిజన్ లలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. తొలుత ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ లోకి వెళ్లి అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. పార్క్ లో ఉన్న ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ను పరిశీలించి వాకర్స్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి డివిజన్ లోని ఇంటింటికి నేరుగా వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ ద్వారా వస్తున్న తాగునీటిని పరిశీలించారు. నీరు పుష్కలంగా వస్తున్నాయని మహిళలు చెప్పడంతో మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. డివిజన్ లో విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, వృద్ధుల పెన్షన్లు, డ్రెయిన్లు తదితర సమస్యలపై ఆరా తీశారు.
అసంపూర్తిగా ఉన్న సైడ్ కాల్వల మరమ్మతులు చేపట్టాలని, అవసరం అయ్యే చోట సీసీ రోడ్స్, సైడు కాల్వలకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి అదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయా లేదా అని అవ్వలను ఆరా తీశారు. ఈ సందర్భంగా సుడా నిధులతో 30వ డివిజన్ లో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో నేడు అద్భుతంగా ప్రజలకు అవసరమయ్యే అన్ని వసతులు కల్పించామని, ప్రతి గల్లిలో వీడీఎఫ్ టెక్నాలజీతో సీసీ రోడ్స్, డ్రెయిన్లు వేశామని అన్నారు. ఇప్పటికే పర్యటించిన డివిజన్లలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, ఇరుకు రహదారులను గుర్తించామని, ప్రజల అభ్యర్థన మేరకు సుడా ఫండ్స్ ద్వారా రూ.12 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రకాష్ నగర్ గోళ్లపాడు ఛానల్ పై మరో పార్క్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నగరమేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్లు యర్ర గోపి, ధనాల శ్రీకాంత్, దోన్వాన్ సరస్వతి రవి నాయక్, ముక్కాల కమల, గజ్జెల లక్ష్మీ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, మున్సిపల్ ఈఈ క్రిష్ణ లాల్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, డీఈ లు నవ్య జ్యోతి, స్వరూప రాణి, తహసీల్దార్ శైలజ, నాయకులు పత్తిపాక రమేష్, మెంతుల శ్రీ శైలం, యర్ర అప్పారావు, పాలడుగు పాపారావు, ఈశ్వర, మల్లేశం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.