- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నిరూపయోగంగా పాలేరు పార్క్.. మూలన పడ్డ విలువైన బోట్లు

దిశ, కూసుమంచి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ ను ఎంచుకున్నారు. అందులో భాగంగానే చిల్డ్రన్స్ పార్క్, పాలేరు రిజర్వాయర్ లో బోటింగ్ తదితర ఏర్పాట్ల కోసం సుమారు మూడు కోట్ల రూపాయలను కేటాయించారు. 26.11.2005 వ తేదీన అప్పటి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు కేంద్ర పర్యాటక శాఖామంత్రి అయిన రేణుకా చౌదరి జాతీయ పర్యాటక శాఖా కార్యదర్శి ఏ.కే మిశ్రాల చేతులమీదుగా ఘనంగా ప్రారంభించారు. సుమారు 30 లక్షల విలువ చేసే 24 మంది ప్రయాణించే సామర్ధ్యం గల ఒకబోటు 10లక్షల విలువైన నలుగురు ప్రయాణించే సామర్ధ్యం కలిగిన 2 బోట్లు ఏర్పాటు చేసి ఘనంగా ప్రారంభించారు.
అక్కడ జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా గోవా రాష్ట్రం నుండి పారా సెయిలింగ్ చేసే సెయిలర్ లని తీసుకొని వచ్చి వారిద్వారా రిజర్వాయర్లో అనేక విన్యాసాలు చేయించారు. అలా ప్రారంభం అయిన పాలేరు పార్క్ సుమారు 2012 వ సంవత్సరం వరకు నిరాటంకంగా నడుస్తూ అటు ఖమ్మం నుంచే కాకుండా సూర్యాపేట కోదాడ ప్రాంతాలకు చెందిన పర్యాటకులను విశేషంగా ఆకర్షించి ఆదివారాలు సెలవు దినాలలో సందడిగా ఉండి మంచి అదాయ వనరుగా ఉండేది.
ఆ సమయంలో పార్కులో ప్రవేశానికి 10రూపాయల ఎంట్రన్స్ టికెట్ గా నిర్ణయించి ఆదాయం పొందారు. దానితోపాటు పెద్ద బోటులో విహరించడానికి ఒక్కో వ్యక్తికీ 15 రూపాయలు, చిన్న బోటులో విహారానికి 30 రూపాయల చార్జ్ వసూలు చేసి అదాయం పొందే వారు ఇలా టికెట్ సెల్లర్, గేట్ కీపర్ వాచ్ మేన్, పార్క్ క్యూరేటర్స్, క్యాంటిన్ వర్కర్స్, బోట్ రైడర్స్ తదితరులు తాత్కాళిక ఉద్యోగం చేస్తూ సుమారు 25 మంది వరకు నిరుద్యోగులు జీవనోపాధి పొందేవారు. ఇలా అంతమందికి జీవనోపాధి కల్పించిన ఈపార్క్ ఇపుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిర్లక్ష్యానికి గురై అంత ఖర్చు పెట్టి తెచ్చిన బోట్లు సరైన మెయింటనేన్స్ లేక పూర్తిగా చెడిపోయినాయి.
అందంగా మలచబడ్డ చెట్లు నిరాదరణకు గురై చిట్టడవిలా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాటర్ ఫౌంటెన్లు నిరూపయోగంగా మారిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈపార్క్ ను పట్టించుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఒక మంచి రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే హాలిడే స్పాట్ గా ప్రాచుర్యం పొందేది. తెలంగాణ రాష్ట్రానికే తలమాణికం అయిన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చని, అలా కాకుండా ఈ ప్రాంతాన్ని ప్రయివేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చినా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చని మేధావులు అభిప్రాయ పడుతున్నారు. కొసమెరుపు ఏమిటంటే 2009లొ శ్రీ నిలయం అనే ఒక సినిమా చిత్రీకరణ ఇక్కడే జరిగింది.