వి కే 5 బొగ్గు గనిలో ప్రమాదం ఇద్దరికి గాయాలు..

by Mahesh |   ( Updated:2022-12-03 12:05:02.0  )
వి కే 5 బొగ్గు గనిలో ప్రమాదం ఇద్దరికి గాయాలు..
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: బొగ్గు గనిలో సైడ్‌ వాల్‌ కూలి ఇద్దరు కార్మికులు గాయపడిన ఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని వికే 5 బొగ్గు గనిలో జరిగింది. ఫస్ట్‌ షిఫ్ట్‌ కార్మికులు రోజుల లాగానే శనివారం ఉదయం విధులకు హజరై గనిలో పనిలో నిమగ్మమై సైడ్‌ చిప్పింగ్‌ తొలగించాల్సి ఉంది. పైకప్పుకు వేసిన పాత రూఫ్‌ బోల్టులు బయటకి వచ్చి కార్మికులకు అడ్డు రావడంతో కార్మికుల సేఫ్టీ కోసం వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్తవి బిగిస్తున్నారు. ఇదే క్రమంలో 108వ లెవల్‌ వద్ద 21 డిప్‌లో ఉన్న ఎలక్ట్రికల్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద పాత రూఫ్‌ బోల్టులను వెల్డర్‌ వినోద్‌, జనరల్‌ మజ్దూర్‌ సంశుద్దీన్‌ కలిసి తొలగిస్తున్న క్రమంలో ఒక్కసారిగా పై కప్పుకూలింది.

ఈ ఘటనలో ఈ ఇద్దరికి గాయాలయ్యాయి. వెల్డర్‌ వినోద్‌ ఎడమ కాలు విరగగా సంశుద్దీన్‌ గదవపై బొగ్గు పెళ్లలు పడి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న సేఫ్టీ మేనేజర్‌ ఘటనా స్థలానికి చెరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తంగా కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కార్మికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలతో అధికారులు కార్మికులపై ఒత్తిడి పెంచుతున్నారని ఈ నేపధ్యంలోనే కార్మికులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్పత్తి లక్ష్యం అధిగమించే క్రమంలో అధికారులు కార్మికుల సేఫ్టీని గాలికి వదిలేస్తున్నారని.. ప్రమాదాలకు పని ఒత్తిడి కారణమని కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి.



Next Story