- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
యథేచ్ఛగా ఇసుక రవాణా.. తూ తూ మంత్రంగా కేసులు..

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరి, పెద్దమండవ గ్రామాల మున్నేరు వాగులో ఇసుక రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ఒక్క కూపన్ పేరుతో మూడు ట్రిప్పుల ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆయా గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్లు 400 వరకు ఉండగా 300 వరకు డ్రైవర్లు మైనర్లే కావడం గమనార్హం. రోడ్లపై అతివేగంగా డ్రైవింగ్ ఎన్నో ప్రమాదాలకు కారణమయ్యారు. ఎక్కువ ట్రిప్పులు కొట్టాలనే ఆలోచనతో మితిమీరిన వేగంతో, ఎక్కువ లోడుతో వెళ్తుండటంతో రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి. వచ్చిపోయే వాహనదారులు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దిశ, ఖమ్మం అర్బన్: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరి, పెద్దమండవ గ్రామాల మున్నేరు వాగు నుంచి అక్రమ ఇసుక రవాణా అడ్డగోలుగా జరుగుతున్నది. అనుమతులు లేకుండా రోజూ రెండు గ్రామాల నుంచి వంద ట్రిప్పుల పైగా ఇసుక రవాణా చేస్తున్నారు. కూపన్ల పేరుతో ఒక్కొక్క రోజు దర్జాగా తరలిస్తున్నా ఏ అధికారి అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఒక్క కూపన్తో మూడుట్రిప్పులు తరలిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి, ముడుపుల వ్యవహారమో కానీ, ఈ రెండు గ్రామాల నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తోడేస్తున్నారు. ఎప్పుడోసారి తనిఖీ చేస్తూ తూతూ మంత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు.
ఎందరో అధికారులు మారినా అక్రమార్కుల వాలకం.. తోలకం ఆగడం లేదు
ఇసుక ట్రాక్టర్లతో ఇప్పటికే బాణాపురం నుంచి పెద్దమండవ వెళ్లాల్సిన బీటీ రోడ్డు గుంతలు పడి మిగతా గ్రామస్థులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అలాగే రైతులు పంట పొలాలకు వెళ్లే రోడ్లు కూడా మోకాళ్ల లోతు గుంతలు పడింది. ఇసుక ట్రాక్టర్లతో ఇప్పటికే ముదిగొండ- వల్లభి రహదారిపై పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి ఎందరో దివ్యాంగులుగా మారగా, కొందరు ప్రాణాలు కోల్పోయారు. పెద్దమండవ, గంధసిరి గ్రామాలలో సుమారు 400 వరకు ట్రాక్టర్లు ఉండగా దాదాపు 300మంది ట్రాక్టర్ డ్రైవర్లు మైనర్లు కావడం గమనార్హం. ఇసుక ట్రాక్టర్ ఏ అధికారికి దొరుకుతుందేమోనని, రెండో ట్రిప్పుకు వెళ్లాలన్న కారణాలతోనో వీరు మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తుంటారు.
డ్రైవర్లు మద్యం సేవించి మరీ ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నా అధికారులకు ఇవేమీ కనిపించడం లేదు. కేవలం ధనార్జనే ధ్యేయంగా ట్రాక్టర్ యజమానులు మైనర్లను, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు అయినా సరే వారినే నడిపిస్తుంటారు. అక్రమ ఇసుక రవాణాపై ఎంతోమంది ఫిర్యాదు చేసినా ఉపయోగం ఉండటం లేదు. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్టవేసి, గ్రామాల్లో మిగిలిన వారికి ఇసుక తరలింపుతో ఇబ్బందులు లేకుండా చూడాలని కొందరు గ్రామస్తులు కోరుతున్నారు.