జోరుగా కలప అక్రమ రవాణా.. హరిత హారం లక్ష్యం నెరవేరేనా?

by S Gopi |
జోరుగా కలప అక్రమ రవాణా.. హరిత హారం లక్ష్యం నెరవేరేనా?
X

దిశ, కూసుమంచి: ఒక్కశాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతం వరకు పెంచాలనే ఉద్దేశంతో అటు అధికారులు.. ఇటు ప్రజలు కృషి చేస్తుంటే.. అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొందరు అక్రమార్కులు విలువైన వృక్షాలను యథేచ్ఛగా నరికివేస్తున్నారు. తెలంగాణకు హరితహారం పేరుతో ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే, కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో విలువైన కలపను వ్యాపారులు జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు అనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇదంతా అటవీ శాఖ అధికారుల కనుసన్నల్లోనే నడుస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

కూసుమంచి మండలంలోని పలు గ్రామాల నుంచి నిత్యం రాత్రి, పగలు అనే తేడా లేకుండా అక్రమ కలప రవాణా జోరుగా సాగుతోంది. చింత, వేప, తుమ్మ చెట్లను దర్జాగా నరికివేస్తూ ట్రాక్టర్ ల సహాయంతో కూసుమంచి మండల కేంద్రంలోని సూర్యాపేట రోడ్డులో గల ఓ దాబా సమీపంలో డంపింగ్ వేసుకుని లారీల ద్వారా ఇతర జిల్లాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరోపక్క అదే మండల కేంద్రంలోని నేలకొండపల్లి రోడ్డులో గల ఓ వెంచర్ సమీపంలో కలప నిల్వ ఉంచారు. మండల వ్యాప్తంగా కొందరు కలప వ్యాపారులు మరికొంతమంది ఏజెంట్ల సహాయంతో కలప రవాణా చేస్తున్నట్లు సమాచారం.

ఇంత జరుగుతున్నా అటవీ శాఖ అధికారులకు తెలియదా?

కలప అక్రమ రవాణాపై అటవీశాఖ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు, కలప వ్యాపారులు చేతులు కలపడంతో వారి సంపాదన మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లుతోందనే ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారులకు అనుమానం రాకుండా.. అప్పుడప్పుడూ తూతూ మంత్రంగా దాడులు చేసి, కేసులు నమోదు చేస్తూ.. పెద్ద ఎత్తున కలపను పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వంట చెరుకు, బొగ్గు బట్టీ ముసుగులో కలప రవాణా సాగుతుంది. ఇంతా జరుగుతున్నా అక్రమ కలప రవాణాను అరికట్టేందుకు అటవీశాఖ అధికారులు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు మేలుకోకుంటే భవిష్యత్తులో ఎన్ని మొక్కలు నాటినా నిష్ప్రయోజనమేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నరికివేత, రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed