ఈ సంవత్సరమే ‘సీతారామ’ నీళ్లు

by Kalyani |
ఈ సంవత్సరమే ‘సీతారామ’ నీళ్లు
X

దిశ బ్యూరో, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు ఈ సంవత్సరమే సీతారామ నీళ్లు అందజేయాలని, అందుకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సత్తుపల్లి మండలం యతాలకుంటలో ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న టన్నెల్ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీతారామ ఎత్తిపోతల పథకం యతాలకుంట టన్నెల్ పనులు 4 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా మెయిన్ కెనాల్, 3 పంప్ హౌస్ లు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకున్నామని, రాజీవ్ లింక్ కెనాల్ ఏర్పాటు చేసుకొని రాబోయే వానాకాలం దుమ్ముగూడెం ఆనకట్టకు గోదావరి నీరు రాగానే వైరా ప్రాజెక్టుకు, పినపాక నియోజకవర్గం తుమ్మలపల్లి వద్ద మారేడు పాక ఎత్తిపోతల పథకం ప్రారంభించి 25 వేల ఎకరాల ఆయకట్టు, కొత్తగూడెం నియోజకవర్గంలో యూటిలు ఏర్పాటు చేసుకొని అన్ని చెరువులకు నీళ్లు వదిలేటట్లు ఏర్పాటు చేయాలని అన్నారు.

సత్తుపల్లి ట్రంక్ టన్నెల్ 1.8 కిలోమీటర్లకు గాను 1.2 కిలో మీటర్లు పూర్తయిందని, పెండింగ్ ఉన్న 600 మీటర్ల పనులు 4 నెలల్లో పూర్తి చేయాలని, అవసరమైతే మరో నిచ్చెన పెట్టుకోవాలని, అప్పటి లోపు అవసరమైన అక్వాడెట్ లు, ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు. శాసనసభ్యులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన భూసేకరణ చేపట్టాలని అన్నారు. వానాకాలం పంట సమయంలో గోదావరి జలాలు రైతులకు ఉపయోగపడాలని, ప్రభుత్వం రాజీవ్ కెనాల్, యతాలకుంటపై చేసిన ఖర్చు సద్వినియోగం కావాలని అన్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు సస్యశ్యామలం కావాలనే ఆకాంక్షతో ఈ ప్రాజెక్టు చేపట్టామని, దీనిని పూర్తి చేయాలని అన్నారు. సత్తుపల్లి, పినపాక, మధిర, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాలకు ఈ సంవత్సరమే సాగునీరు అందాలని అన్నారు.

వైరా ప్రాజెక్టు కింద లక్ష 30 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని అన్నారు. నాగార్జునసాగర్ నీళ్లు రాకపోయినా రైతులకు ఇక ఇబ్బంది ఉండదని అన్నారు. సీతారామ ప్రధాన కాలువ శుభ్రం చేయాలని, నీరు వదిలితే త్వరగా వైరా ప్రాజెక్టులోకి నీళ్లు వెళ్లేలా చూసుకోవాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు వచ్చిన కలెక్టర్ దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. ప్రతి సమస్య వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అటవీ అభ్యంతరాలు, భూసేకరణ, లీగల్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ లు ముజమ్మిల్ ఖాన్, జితేష్ వి. పాటిల్, అశ్వారావుపేట, సత్తుపల్లి ఎమ్మెల్యే లు జారే ఆదినారాయణ, మట్టా రాగమయి, ఇరిగేషన్ సిఇ ఏ. శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఇ ఎస్. శ్రీనివాస రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఇ శ్రీనివాసా చారి, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed