వారంతా 'స్మార్ట్ కిడ్జ్స్​'...ఆకట్టుకున్న ఇన్ స్పైర్-2022

by Sridhar Babu |

దిశ, ఖమ్మం బ్యూరో : అణువు నుంచి అంతరిక్షం దాకా అన్ని అంశాలను ప్రదర్శించి నగరంలోని 'స్మార్ట్ కిడ్జ్' పాఠశాల చిన్నారులు తమ సృజనాత్మకతను నిరూపించుకున్నారు. ఉత్సాహంగా సాగిన ఇన్ స్పైర్-2022ను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. చిన్నారుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి వారి నుంచి ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడే జాగ్రత్తలు, బాధ్యతలు తదితర అంశాలపై విద్యార్థులు చక్కగా వివరించారు. రాజ్యాంగం దాని హక్కులు, బాధ్యతలు, పార్లమెంట్ భవనం, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే ఆలోచన శైలి, జ్ఞానం పెరగాలంటే ఇలాంటి ఇన్ స్పైర్ లు విద్యార్థులకు చాలా అవసరం అని, దానికి అనుగుణంగా పాఠశాల యాజమాన్యం కార్యక్రమాలను నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. ఖమ్మంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఏర్పాటు చేసిన సెట్టింగ్ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసమే తాము ప్రతి సంవత్సరం ఇన్ స్పైర్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం జిల్లా అధ్యక్షుడు బి. రామచంద్రరావు, కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్ , టూ టౌన్ సీఐ శ్రీధర్, పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed