'గొత్తి కోయల పట్ల వివక్ష తగదు.. గ్రామసభ తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలి'

by Disha Web Desk 13 |
గొత్తి కోయల పట్ల వివక్ష తగదు.. గ్రామసభ తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలి
X

దిశ చండ్రుగొండ: చండ్రుగొండ మండలం లోని బెండల పాడు గ్రామ పంచాయతీ ఎర్రబోడు గ్రామ ఆదివాసీలను గ్రామ బహిష్కరణ చేయడం సరికాదని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వజ్జా సురేష్, సరియం కోటేశ్వరరావు లు డిమాండ్ చేశారు. గొత్తి కోయల పట్ల వివక్ష చూపడం తగదని, ఒకరిద్దరు చేసిన తప్పుకు గ్రామ బహిష్కరణ సరికాదని, గ్రామసభ చేసిన తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

టీఏజీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎర్రబోడు ఆదివాసి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ మధ్యకాలంలో అటవీ శాఖ అధికారి చలమల శ్రీనివాసరావు హత్య సంఘటన కారణంగా చూపించి ఆదివాసి గ్రామాన్ని వెలివేయడం సరి కాదు అని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు ఆదివాసుల అభివృద్ధి కోసం ఉపయోగపడాలి తప్ప ఆదివాసీలను అణిచి వేయడానికి కాదని వారు అన్నారు. ఎర్రబోడు గ్రామ ప్రజలకు ఆధార్, ఓటర్ కార్డులు, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు అన్ని ఉన్నాయని బలవంతంగా గ్రామాన్ని ఖాళీ చేయించాలని చూడడం తగదని అన్నారు.


పిసా, 1/70, అడవి హక్కుల లాంటి చట్టాలు ఆదివాసీలకు అండగా ఉండాలని ఆ చట్టాలను అడ్డుపెట్టుకుని ఆదివాసీలను అడవికి దూరం చేయడానికి చూస్తే సహించమని అన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గొత్తి కోయల పట్ల మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని గొత్తి కోయలు కూడా ఈ దేశానికి చెందిన వారేనని గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం.. ఈ దేశ పౌరుడు దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించడానికి హక్కు ఉందని అలాంటిది ఆదివాసీలకు ఏజెన్సీలో జీవించే హక్కు లేదా అని ప్రశ్నించారు. తక్షణమే చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గొత్తి కోయల, సున్నితమైన సమస్యను రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు గౌరీ నాగేశ్వరరావు, మడివి రమేష్, ముక్తి రామకృష్ణ, కాకా హనుమంతు, పోడియం వెంకటేశ్వర్లు, కాకా పాపారావు, అదేం కోరయ్య, గుర్రాయి గూడెం సర్పంచ్ కాక సీత తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed