The story of Golmal, a scrap that reached Kanchi

by Sridhar Babu |
The story of Golmal, a scrap that reached Kanchi
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీ కార్యాలయంలో భద్రపరిచిన స్క్రాప్ ఇనుము, స్వచ్ఛ రిక్షాల గోల్ మాల్ కథ కంచికి చేరింది. ఈ మున్సిపాలిటీ కార్యాలయంలో భద్రపరిచిన స్క్రాప్ ఇనుము, రిక్షాలు మాయమైనట్లు 4 నెలల క్రితమే బహిర్గతమైనప్పటికీ కనీసం వాటి గురించి పట్టించుకున్న వారే కరువయ్యారు. ఈ స్క్రాప్ మాయం చేసిన అప్పటి ఎఫ్ఏసీ కమిషనర్ పై కనీస చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ వ్యవస్థలు ప్రజల్లో నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయాయి. స్క్రాప్​ ను మాయం చేసిన అప్పటి కమిషనర్ అనిత పై చర్యలు తీసుకోవాలని మెజార్టీ కౌన్సిలర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా కనీసం పట్టించుకున్న వారే కరువయ్యారు. కౌన్సిలర్ల ఫిర్యాదు కే దిక్కు లేదంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైరా మున్సిపాలిటీలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణంకు అవసరమైన స్థలం కోసం మున్సిపాలిటీ ఆఫీస్ సమీపంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ తాత్కాలిక క్యాంప్ ఆఫీస్ తో పాటు, ఆ పక్కనే ఉన్న మరో గోదామును కూల్చి వేశారు. ఈ గోదాముకు సంబంధించిన స్క్రాప్ ఇనుముతో పాటు ఇతర సామగ్రిని వైరా మున్సిపాలిటీ కార్యాలయంలో భద్రపరిచారు.

అదేవిధంగా వైరా రిజర్వాయర్ వద్ద ఉన్న పట్టు పరిశ్రమ భవనాన్ని గతంలో కూల్చివేశారు. ఈ భవనానికి సంబంధించిన స్క్రాప్ ఇనుముతో పాటు ఇతర సామగ్రి కనిపించడం లేదు. సోమవారం (వైరా) గ్రామపంచాయతీ గా ఉన్నప్పుడు 20 స్వచ్ఛ రిక్షాలను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల రిక్షాలు వైరా మున్సిపాలిటీకి అప్పగించారు. అయితే ఈ స్వచ్ఛ రిక్షాలు మాయమయ్యాయి. టన్నుల కొద్దీ ఇనుముతో పాటు రిక్షాలు కనిపించకపోయినా కనీసం పట్టించుకునే వారే కరువయ్యారు. గత ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీ వరకు ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన కమిషనర్ అనిత హయాంలోనే ఈ గోల్ మాల్ జరిగింది. అయితే ఈ సంఘటన సంబంధించి నేటి వరకు అధికారులు పోలీసులు కూడా ఫిర్యాదు చేయలేదు.

లక్షలాది రూపాయల స్క్రాప్ ను మాయం చేసిన వారిని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ స్క్రాప్​ను పాత ఇనుము దుకాణంలో విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ సొత్తు అయిన ఇనుప స్క్రాప్​ను లక్షలాది రూపాయలకు విక్రయించిన అప్పటి కమిషనర్ పై చర్యలు తీసుకోకుండా ఊదాసీనంగా వ్యవహరించటం పలు విమర్శలకు దారితీస్తుంది. సోమవారం లో మంచినీటి ట్యాంకు కూలగొట్టే వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన అప్పటి కమిషనర్ పై కేసు నమోదు చేయకుండా అధికారులు ద్వంద నీతిని చాటారని విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అప్పటి కమిషనర్ అనిత హయాంలో మున్సిపాలిటీలో అనేక అవకతవకులు జరిగాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి స్క్రాప్ ను మాయం చేయటంతో పాటు అనేక అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని వైరా మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed