వైరా మున్సిపాలిటీలో ప్రతిపక్షమైన అధికార పార్టీ

by Nagaya |
వైరా మున్సిపాలిటీలో ప్రతిపక్షమైన అధికార పార్టీ
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీలో ఇటీవల వరకు ఇన్చార్జి కమిషనర్‌గా పనిచేసి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన అనిత హాజరైనప్పుడే సాధారణ సమావేశం నిర్వహించాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు డిమాండ్ చేశారు. వైరాలోని మున్సిపాలిటీ సమావేశ మందిరంలో సోమవారం మున్సిపాలిటీ సాధారణ సమావేశాన్ని చైర్మన్ సూతకాని జైపాల్ అధ్యక్షతన నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి ఇటీవల వరకు వైరా మున్సిపాలిటీ ఇంచార్జి కమిషనర్‌గా పనిచేసి ప్రస్తుతం ఏఈగా పనిచేస్తున్న అనిత గైర్హాజరు కావడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి సమావేశాన్ని బహిష్కరించారు.

అనిత ఇన్చార్జి కమిషనర్‌గా పనిచేసిన సమయంలో వైరా మున్సిపాలిటీలో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారంలో ఆమె కీలకంగా వ్యవహరించారని బిఆర్ఎస్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు బహిరంగగా విమర్శించారు. ఆమె హయాంలో సోమవారం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా మంచినీటి ట్యాంకును కూల్చివేశారు. అంతేకాకుండా చైర్మన్ జైపాల్ ఇంటి నిర్మాణ అనుమతులు తీసుకోలేదని కౌన్సిలర్లు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన తర్వాత ఆగ మేఘాల మీద డిటి, అప్పటి టీపీవో, ఇన్ఛార్జి కమిషనర్ ఇంటి అనుమతులు మంజూరు చేయడం పట్ల కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలోని లక్షల రూపాయల స్క్రాప్ కూడా మాయమైంది. మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులను అక్రమంగా నియమించారు. చైర్మన్ సంతకంతో ఉన్న ధ్రువీకరణ పత్రంతో ట్యాంకు కూల్చివేసిన స్థలాన్ని గొల్లపూడి కృష్ణారావు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ వ్యవహారాలన్నీ అనిత హయాంలో జరగటంతో ఆమె సమావేశానికి వచ్చి సమాధానం చెప్పాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. సమావేశం సమాచారాన్ని అనితకు ముందుగానే అందించినప్పటికీ అవినీతి అక్రమాలపై సమాధానం చెప్పాల్సి వస్తుందని అనారోగ్యం పేరుతో సమావేశానికి హాజరు కాలేదని కౌన్సిలర్లు ధ్వజమెత్తారు.


ఈ సమావేశంలో అధికార పార్టీ అయినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రతిపక్షం అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాయమైన ట్యాంక్ ఎక్కడ....? చైర్మన్‌కు ఒక రూల్... సామాన్యూలకు ఒక రూలా...?, నిబంధనలు పాటించని అధికారులపై చర్యలేవి...? స్క్రాప్ మాయంపై చర్యలు శూన్యం, మంచినీటి ట్యాంకును కూల్చిన వారిపై చర్యలేవి..? డీజిల్ దొంగలు ఎవరు..?, అక్రమ నియామకాలు చేపట్టింది ఎవరు..? మంచినీటి ట్యాంక్ స్థలం రిజిస్ట్రేషన్ కోసం ధ్రువీకరణ పత్రం జారీ చేసింది ఎవరు..? తదితర స్లొగన్స్లతో సమావేశంలో బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఫ్లా కార్డులు ప్రదర్శించారు. అనిత గైరాజరు కావడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కమిషనర్ పి.వెంకటేశ్వర్లు సమావేశాన్ని వాయిదా వేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించటంతో ఎమ్మెల్యే రాములు నాయక్ వెను తిరిగి వెళ్లారు. ఇదిలా ఉంటే దళితుడైన తనతో పాటు ముగ్గురు కౌన్సిలర్లను ఉద్దేశంగా పూర్వకంగా పాలకవర్గ సభ్యులు వేధిస్తున్నారని చైర్మన్ సూతకాని జైపాల్ ఆరోపణలు చేయడం విశేషం.



Next Story

Most Viewed