ఏజెన్సీలో స్మగ్లర్ల నయా పంథా.. ఒకే నెంబర్ పై రెండు వాహనాలు

by Mahesh |
ఏజెన్సీలో స్మగ్లర్ల నయా పంథా.. ఒకే నెంబర్ పై రెండు వాహనాలు
X

దిశ, కొత్తగూడ : అక్రమ కలప తరలిస్తున్న స్మగ్లర్లు నయా పంథాను ఎంచుకున్నారు. ఏజెన్సీ మండలాల నుంచి పట్టణాలకు గత కొన్ని రోజులుగా అక్రమంగా కలప తరలిస్తున్న సంగతి తెలిసిందే. కాగా అధికారులకు దొరక్కుండా ఒకే నెంబర్‌తో వేరు వేరు వాహనాలను నడిపిస్తున్నారు. గత పది రోజుల కిందట ఓటాయి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం రాత్రి రాంపూర్ సమీపంలో అక్రమంగా కలప తరలిస్తున్న మరో వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.లక్ష ఉన్నట్లు ఎఫ్ఆర్వో వజహత్ తెలిపారు.

దీనితో పాటుగా ఓటాయి గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 10 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం అటవీశాఖ కార్యాలయానికి వాహనాలను తీసుకొచ్చారు. తీసుకొచ్చాక అసలు విషయం తెలిసింది. ఒకే నెంబర్‌తో రెండు అశోక్ లేల్యాండ్ వాహనాలు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఈ దాడిలో సెక్షన్ అధికారి రాజేష్, బీట్ అధికారులు వేణు ,రాకేష్ ,రవి ,సూరయ్య,బేస్ క్యాంప్ సిబ్బంది శివ, నితిన్ ,మోహన్, వీరేష్‌లు పాల్గొన్నారు.



Next Story