ఐటీసీ ప్రజాభిప్రాయ సేకరణ చట్ట విరుద్ధం

by Sridhar Babu |
ఐటీసీ ప్రజాభిప్రాయ సేకరణ చట్ట విరుద్ధం
X

దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ కర్మాగారం 8వ యూనిట్ ఏర్పాటు చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ చట్ట విరుద్ధమని దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య అన్నారు. బూర్గంపాడు మండల కేంద్రంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సారపాక గ్రామపంచాయతీ కార్యాలయంలో జరగాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ కంపెనీ పరిధిలో పెట్టడం సమంజసం కాదని, అందులోనూ గ్రామసభ నిర్వహించకుండా ప్రజా అభిప్రాయ సేకరణ ఏ విధంగా సేకరిస్తారని ప్రశ్నించారు. కంపెనీకి అనుకూలంగా ఉన్న వారితో మాట్లాడిస్తే సరిపోతుందా? అదేవిధంగా ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చేందుకు సిద్ధపడిన బీఎస్పీ నాయకులను, మాజీ సర్పంచ్ చందు నాయక్ ను అరెస్టు చేయడం దారుణమని, దీనిని దళిత సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.

అదేవిధంగా ఏడో యూనిట్ ప్రారంభించే ముందు కాలుష్య నియంత్రణ మండలి 2011లో కాన్సెంటు ఎస్టాబ్లిష్మెంట్ ఆర్డర్లో 16వ నిబంధన ప్రకారం కంపెనీ 289 ఎకరాల గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని, చెయ్యకపోతే నిబంధన 25 ప్రకారం ఏడో యూనిటును రద్దు చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. అదేవిధంగా కాన్సెంట్ అథారిటీ ఆథరైజేషన్ ఆర్డర్ ప్రకారం 2013 సంవత్సరంలో నిబంధన 14 ప్రకారం 289 ఎకరాల గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాలుష్య నియంత్రణ మండలి చెప్పటం జరిగిందని, ఏడో యూనిట్​కు సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి విధించిన నిబంధనలు ఎక్కడా కూడా ఐటీసీ కంపెనీ పాటించలేదన్నారు. 289 ఎకరాలు గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయలేదన్నారు. ఏడవ యూనిట్ విషయంలో అన్ని నిబంధనలు ఉల్లంఘించినా కాలుష్య నియంత్రణ మండలి ఐటీసీ కంపెనీకి వత్తాసు పలకడం చాలా దారుణమన్నారు.

ఇప్పుడు ఎనిమిదో యూనిట్​ను ఏ విధంగా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. శుక్రవారం జరిగిన ప్రజా అభిప్రాయ సేకరణకు వచ్చిన జాయింట్ కలెక్టర్ ఓ ప్రభుత్వ అధికారిగా వ్యవహరించకుండా ప్రైవేట్ కంపెనీకి వత్తాసు పలకడం దారుణమన్నారు. ఈయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎనిమిదో యూనిట్​కు జరిగిన ప్రజా అభిప్రాయ సేకరణను రద్దుచేసి, ఐటీసీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో దళిత సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి తగరం రాంబాబు,రాష్ట్ర కార్యదర్శి కొలకపోగు ధర్మరాజు, దళిత సంక్షేమ సంఘం సోషల్ మీడియా కోఆర్డినేటర్ కంటే కేశవ్ గౌడ్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed