సాగు భూములపై బడా నేతల కన్ను .. జిల్లాలో విచ్చలవిడిగా అనుమతి లేని వెంచర్లు

by Kalyani |
సాగు భూములపై బడా నేతల కన్ను .. జిల్లాలో విచ్చలవిడిగా అనుమతి లేని వెంచర్లు
X

దిశ, నేలకొండపల్లి : జిల్లాలో విచ్చలవిడిగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, ఇప్పుడు పల్లెల్లోనూ శరవేగంగా విస్తరిస్తోంది. రియల్‌ మాఫియా ఆగడాలకూ అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఏజెన్సీ, నాన్‌ ఏజెన్సీ తేడా లేకుండా విచ్చలవిడిగా అక్రమ లేఔట్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జిల్లా మీదుగా వెళ్తోన్న 365A జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న నేలకొండపల్లి, ముదిగొండ మండలాలతో పాటు జిల్లాకేంద్రం పరిసర ప్రాంతాల్లోనూ అనుమతి లేకుండా వెంచర్లను ఏర్పాటు చేస్తూ భూములను అమ్ముకుంటున్నారు. అమాయక రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని పంట భూములను ప్లాట్లుగా మార్చేస్తున్నారు. గ్రామాల్లో పంటలతో పచ్చగా కనిపించాల్సిన పంట పొలాలా, ప్రస్తుతం వెంచర్లతో బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయా మండలకేంద్రాల చుట్టూ ఉన్న వ్యవసాయ భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. జిల్లాలోని పట్టణ ప్రాంతంలో 35, గ్రామీణ ప్రాంతంలో 16 వెంచర్లకు మాత్రమే అనుమతులున్నాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. మిగితా 216 వెంచర్లు అనధికారిక లే ఔట్లుగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. లెక్క ప్రకారం జిల్లాలో వందలాది వెంచర్లు ఉన్నా.. ఎక్కడా హద్దురాళ్లను తొలగించిన దాఖలాలు కనిపించడం లేదు. ఒకవేళ తొలగించినా వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా ప్లాట్లను అమ్మేసుకుంటున్నారు. నేలకొండపల్లిలోనూ యథేచ్ఛగా దందా సాగుతోంది. పెట్టుబడులకు పదింతల లాభాలు రావడంతో పలువురి అండదండలతో రియల్‌ వ్యాపారులు జిల్లాలో అక్రమ వెంచర్లను వేస్తూ తమ ప్రతినిధులతో పాటు మధ్యదళారులతో ప్లాట్లను అమ్మేస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, ఉద్యోగులు ఇదే పనిగా మార్చుకుని లేఔట్లను ఏర్పాటు చేస్తున్నారు.

అనుమతులు లేకున్నా..


అనుమతి లేకుండా అక్రమ వెంచర్లను ఏర్పాటు చేస్తున్నా అడిగే వారే లేరన్న ధీమాతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంతో పాటు ముదిగొండ, కూసుమంచి మండల కేంద్రాల చుట్టూ సాగు భూముల్లో అక్రమ వెంచర్లు అడ్డగోలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా, పంచాయతీ, రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అన్నీ తెలిసీ.. అధికారుల మౌనం

అనుమతులు లేకుండా వెంచర్లను ఏర్పాటు చేయరాదనే నిబంధన ఉన్నా, నేలకొండపల్లి, తిరుమలాపురం, కొత్త కొత్తూరు, చెర్వుమాధరం, పైనంపల్లి గ్రామాల్లో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా ప్లాట్ల అమ్మకాలు జరుపుతున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా మౌనంగానే ఉండిపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదో అడపాదడపగా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం, ఆ తర్వాత అంతా మరిచిపోవడంతో క్షేత్రస్థాయిలో అక్రమ వెంచర్లకు అడ్డుకట్ట పడడం లేదు. స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి అక్రమ వెంచర్లను తొలగించాల్సిన అధికారులే, అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆర్థిక పరపతి, రాజకీయ నేతల ఒత్తిళ్లతో వాటి జోలికి వెళ్లడం లేదంటున్నారు. రైతుల బినామీ పేర్లతో రియల్‌ వ్యాపారానికి దిగుతున్నారు. నేలకొండపల్లి మండల కేంద్రానికి సమీపంలోని ప్రభుత్వ స్థలాల నుంచి అక్రమ మట్టి రవాణా చేస్తూ రియల్టర్లు లాభాలు గడిస్తున్నారు. దీనిపై మైనిగ్, రెవెన్యూ, పంచాయితీ రాజ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. ఇటువంటి అక్రమ వెంచర్లపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

కూలీలుగా మారుతున్న అన్నదాతలు


వ్యవసాయమే ప్రధాన వృత్తిగా నమ్ముకొని జీవనం సాగిస్తున్న అన్నదాతలు భూములను అమ్ముకుని కూలీలుగా మారుతున్నారు. నేలకొండపల్లి ప్రాంతాల్లో రైతులకు భూములు ఉన్నా పట్టాలు లేక పోవడంతో కొందరు అమాయకులను అడ్డంగా పెట్టుకొని రియల్‌ దందాకు ఎగబడుతున్నారు. గ్రామాల్లో చక్రం తిప్పుతున్న కొందరు పెద్దలు రియల్‌ మాఫియాతో చేతులు కలిపి గుట్టు చప్పుడు కాకుండా అమ్మేసుకుంటున్నారు. చూస్తుండగానే ఏటా వందల ఎకరాల భూములు ప్లాట్లుగా మారిపోతున్నాయి. గ్రామాల్లో నిరాశతో కనిపిస్తున్న కొందరు అన్నదాతలకు డబ్బులను ఆశచూపుతున్నారు. కొందరు పెద్దలు ఇదే పనిగా దళారీదందాకు ఎగబడుతున్నారు. గ్రామాల్లో కొంత పలుకుబడి ఉండి, తెలివితేటలు ఉన్న వారంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే సులువుగా తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించే అవకాశం ఉండడంతో ఎంతకైనా తెగిస్తున్నారు. వివాదస్పద భూములను గుర్తించి సెటిల్‌ చేస్తామని నమ్మబలుకుతూ విలువైన భూములను చౌక ధరలకే కొట్టేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించక పలువురు అన్నదాతలు విలువైన భూములను అమ్మేసుకునేందుకే మొగ్గుచూపుతున్నారు. వచ్చిన డబ్బులతో ఇతర వ్యాపారాల్లో స్థిరపడుతున్నారు. ఏటా పంట భూముల విస్తీర్ణం గణనీయంగా తగ్గడం ఆందోళన రేపుతోంది. దీనిపై సమాచార హక్కు చట్టం ఉపయోగించి నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన సామాజికవేత్త పసుమర్తి శ్రీనివాసరావు పలుమార్లు అధికారులకు విన్నవించినా నామమాత్రపు తనిఖీలతో ప్రస్తుతం నేలకొండపల్లి మండల కేంద్రంలో ఆరు వెంచర్లలో నేలకొండపల్లి గ్రామపంచాయతీకి 6,094 గజాలు ఇటీవల రియాల్టర్లు రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే సామాజికవేత్త మాత్రం నేలకొండపల్లి మండల కేంద్రానికి ఇంకా 36వేల గజాల స్థలం పంచాయతీకి చేరాలని కోరుతున్నారు.దీని విలువ దాదాపు కొన్ని కోట్ల విలువ ఉంటుందని చెబుతున్నారు.

అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తే చర్యలు: జమల రెడ్డి, ఎంపీడీవో

అనధికార లేఔట్లు, అనధికార భవన నిర్మాణాలు జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 12 అనధికార లేఔట్లను తొలగించాంజ బై నెంబర్‌తో వచ్చే భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను కాపాడాలి. గ్రీన్ బెల్ట్ తీయని వాటిపై చర్యలు తీసుకుంటాం . ఖచ్చితంగా 10% గ్రీన్ బెల్ట్ చూపి లేఅవుట్ పర్మిషన్ కి వెళ్తున్నారు.

వీఆర్ఏ అడ్డుపడ్డా ఆగని మట్టి దందా

నేలకొండపల్లి బస్ స్టాండ్ పక్కన ఓ వెంచర్ కి అక్రమంగా మట్టి తరలించడాన్ని ఆపాలంటూ తహశీల్దార్ ఆదేశాల మేరకు వీఆర్ ఏ వెళ్లారు. కానీ రియల్టర్లు మేం పనులు ఆపమంటూ మీకు ఇష్టం వచ్చిన వద్ద ఫిర్యాదు చేసుకొమ్మని పనులు సాగిస్తున్నారంటే రియల్టర్ల దందాకు ఇంతకన్నా నిదర్శనం కావాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీంతో వీఆర్ఏ చేసేదేమీ లేక వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది. పలువురు ప్రజాప్రతినిధులు అండదండలతో ఈ వెంచర్ల పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుమతి లేని అక్రమ వెంచర్ల ఏర్పాటుకు అడ్డుకట్ట వేయాలని, ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed