- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా .. దర్జాగా శాశ్వత కట్టడాలు కట్టిన ఆక్రమణదారులు

దిశ, వైరా : ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు 30 సంవత్సరాలుగా వైరాలోని వ్యవసాయ శాఖకు చెందిన ప్రభుత్వ భూమి కబ్జాదారుల కబందాస్తాల్లో చిక్కుకుపోయింది. 30 ఏళ్లుగా కబ్జాదారులు ప్రభుత్వ భూమిని దర్జాగా వాడుకుంటున్నారు. ఈ ప్రభుత్వ భూమిలో శాశ్వత కట్టడాలు నిర్మించి వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేశారు. కొంతమంది సొంతంగా అక్రమ భవనాల్లో వ్యాపారాలు నిర్వహిస్తుండగా.. మరి కొంతమంది ఒక్కో భవనాన్ని నెలకు 15 వేల రూపాయలకు పైగా అద్దెకు ఇచ్చి అక్రమ మార్గంలో ఆదాయాన్ని గడిస్తున్నారు. వైరాలోని నడిబొడ్డున మధిర క్రాస్ రోడ్ లో జాతీయ రహదారి పక్కన ఉన్న కబ్జాకు గురైన వ్యవసాయ శాఖ స్థలం విలువ సుమారు 10 కోట్ల రూపాయల పైన ఉంటుంది. ఈ కబ్జాదారుల్లో రాజకీయ నాయకులు కూడా ఉండటం విశేషం. ఇటీవల జిల్లా కలెక్టర్ గౌతమ్ వైరాలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించాలని రెవెన్యూ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అయితే నీటిపారుదల శాఖ ఆర్ అండ్ బి శాఖ స్థలాల్లోతో పాటు ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించిన అధికారులు వ్యవసాయ శాఖ స్థలంలోని ఆక్రమణలను తొలగించకుండా వదిలివేశారు. ఈ ఆక్రమణ తొలగించకుండా అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని స్థానికంగా చర్చించుకుంటున్నారు.
1000 గజాల పైన ఆక్రమణ..
వైరాలోని మధిర క్రాస్ రోడ్ సమీపంలో ప్రభుత్వం వ్యవసాయ శాఖకు 14.19 కుంటల భూమిని కేటాయించింది. అయితే సుమారు 450 గజాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అప్పట్లో గోదాము నిర్మించారు. 30 ఏళ్ల క్రితం మిగిలిన ఈ వ్యవసాయ శాఖ స్థలాన్ని సుమారు పదిమంది వ్యక్తులు ఆక్రమించారు. ప్రస్తుతం ఆ వ్యక్తుల కబందాహస్తాల్లో సుమారు 1000 గజాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ ప్రభుత్వ స్థలంలో అప్పట్లోనే శాశ్వత కట్టడాలు నిర్మించారు. ఈ దుకాణాల్లో కొంతమంది సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. మరి కొంతమంది ఒక్కో దుకాణాన్ని నెలకు రూ.15 వేలకు పైగా అద్దెకిచ్చి దర్జాగా నెలవారి ఆదాయం పొందుతున్నారు. సుమారు వెయ్యి గజాల్లో మొత్తం 10 దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ ఆక్రమణలో ఓ రాజకీయ పార్టీ కార్యాలయం కూడా ఉండటం విశేషం. వైరా నడిబొడ్డున 10 కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైన పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో ఆక్రమణదారులు గత 30 ఏళ్లుగా ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది.
ఆక్రమణకు గురైన స్థలం విలువ రూ. పది కోట్లకు పైన మాటే..
వైరా నడిబొడ్డున ఆక్రమణకు గురైన వ్యవసాయ శాఖ స్థలం విలువ అక్షరాల 10 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. ఇటీవల ఈ ప్రాంతంలో మార్కెట్ ధర ప్రకారం గజం లక్ష రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ ధర మరింత పెరిగింది. మార్కెట్ విలువ ప్రకారం పరిగణలోకి తీసుకుంటే ఈ స్థలంలో పది కోట్లు రూపాయలు దాటుతుంది. జాతీయ ప్రధాన రహదారి పక్కన వైరా నడి బొడ్డు ఉన్న ఈ స్థలం కు ఎంతో డిమాండ్ ఉంది. ఈ స్థలంలో షాపులు అద్దెకిచ్చినవారు అడ్వాన్సుల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారంటే ఈ స్థలం కు ఉన్న డిమాండ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఈ స్థలంలో అక్రమ కట్టడాలు ఉండటంతో వ్యవసాయ శాఖ గోదాం, కార్యాలయం పూర్తిగా చుట్టూ మూసి వేయబడింది. 10 కోట్ల రూపాయల విలువైన స్థలం కబ్జాకు గురైన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కబ్జాదారులు వీరే..
వ్యవసాయ శాఖ స్థలాన్ని కబ్జా చేసిన వారి పేర్లను అనేకసార్లు స్థానిక రెవిన్యూ, వ్యవసాయ అధికారులు జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులకు, వ్యవసాయ శాఖ కమిషనర్ కు పంపారు. సుమారు పదిమంది అధికారులు పేర్కొన్న జాబితాలో ఉన్నారు. వీరిలో ఒకరు చికెన్ షాప్ యజమాని కాగా మరో ఇద్దరు అధికార పార్టీ రాజకీయ నాయకులు ఉన్నారు. వీరితోపాటు ఒక రాజకీయ పార్టీ కార్యాలయం ఈ ఆక్రమణలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి చెందిన మరో రాజకీయ నాయకుడు ఈ కబ్జాదారుల జాబితాలో ఉన్నారు. వీరితోపాటు మరి కొంతమంది కబ్జాదారుల్లో ఉన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి గారు.. స్పందించరు
వ్యవసాయ శాఖ భూమిని కబ్జా కోరల్లో నుంచి రక్షించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగు నిరంజన్ రెడ్డిని మండల రైతులు కోరుతున్నారు. వైరా మండలంలోని ముసలి మడుగు గ్రామంలో సోమవారం నిరంజన్ రెడ్డి పర్యటన ఉంది. వైరా మండలానికి వస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి ఈ వ్యవసాయ శాఖ ఆక్రమణను పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. 10 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆక్రమణదారులు నుంచి రక్షించి వ్యవసాయ శాఖకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ స్థలంలో ఆక్రమణ తొలగించి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో దుకాణాలు నిర్మిస్తే అద్దె రూపంలో నెలకు లక్షలాది రూపాయలు వ్యవసాయ శాఖ ఆదాయం లభించే అవకాశం ఉంది. ఇప్పటికైనా మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ స్పందించి ఈ ఆక్రమణలను తొలగించాలని మండల రైతులు కోరుతున్నారు.