- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అంతుచిక్కని వై'రా'జకీయం

బీఆర్ఎస్ ను వెంటాడుతున్న కోవర్టుల భయం
దిశ, వైరా: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోనే వైరా నియోజకవర్గ రాజకీయం రంజుగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీల్లోని అధిష్టాన పెద్దలకే వైరా రాజకీయం ఏమాత్రం అంతు చిక్కడం లేదు. బీఆర్ఎస్ పార్టీని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో బహిరంగంగానే విమర్శిస్తుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అయితే, పొంగులేటి రాజకీయంలో వైరా నియోజకవర్గ కేంద్ర బిందువుగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా వైరా నియోజకవర్గంలో 20 మంది నేతలను బీఆర్ఎస్ ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. దీంతో నాయకులు మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు దుమ్మెత్తి పోసుకునే స్థాయిలోకి చేరాయి. ఈ విమర్శలు వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్లాయంటే ఇక్కడ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గమైన వైరాలో జరుగుతున్న రాజకీయాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ ఉందంటే పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందో అంచనా వేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీని కోవర్టుల భయం వెంటాడుతూనే ఉంది. 2018 సాధారణ ఎన్నికల్లో వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన లావుడ్య రాములు నాయక్ గెలుపునకు పొంగులేటి వర్గీయులు బహిరంగంగానే కృషి చేశారు. అప్పట్లో వైరా ఎమ్మెల్యేగా ఉన్న బానోత్ మదన్ లాల్ పై ఉన్న తీవ్ర వ్యతిరేకతతో పొంగులేటి వర్గీయులు రాములు నాయక్ ను బలపరిచారు. ఎన్నికల్లో రాములు గెలిచిన నాటి నుంచి ఇప్పటివరకు పొంగులేటి వర్గీయులు ఎమ్మెల్యే ఫాలోవర్స్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం పొంగులేటి బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించటంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంట వుండే పొంగులేటి వర్గీయులు ఆ పార్టీని వీడి శ్రీనివాసరెడ్డి గూటికి చేరారు. దీంతో వైరాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 20 మందిని నాయకులను బహిష్కరించినట్లు ఆ పార్టీ జిల్లా అధిష్టానం ప్రకటించింది. అదేవిధంగా పార్టీ ద్వారా లభించిన పదవులకు వారు రాజీనామా చేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వైరా నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో శ్రీనివాసరెడ్డి వర్గంలోకి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లలేదు, చాలామంది ఎమ్మెల్యే వెంటే ప్రస్తుతం ఉన్నారు. అయితే, ఇటీవల మంత్రి అజయ్ కుమార్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్ లో ఉంటే ఆత్మసాక్షిగా పనిచేయాలి, కోవర్టులుగా మారాలనుకునే వాళ్లు పార్టీని వీడి వెళ్లడం మంచిదని బహిరంగంగా ప్రకటించారు. పార్టీలో ఉంటూ కోవర్టుగా పనిచేస్తే మొదటికి మోసం వస్తుందని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు బానోత్ చంద్రావతి, బానోత్ మదన్లాల్ వైరాలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఉండగానే తమ సొంతంగా వేరు వేరుగా క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు.
పొంగులేటి గూటికి చేరేది ఎందరో...
నియోజకవర్గంలోని పొంగులేటి గూటికి చేరే వారేందరో ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆయనతో చేరిన వారి సంఖ్య నామే. అయితే, 15న వైరాలో పొంగులేటి వర్గీయుల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. ఈ సమ్మేళనానికి బీఆర్ఎస్ పార్టీలో నుంచి పొంగులేటి వర్గం వైపు ఎంతమంది వెళ్తారనే విషయం స్పష్టమయ్యే అవకాశం ఉంది. గతంలో పొంగులేటి వర్గీయులుగా ఉండి ప్రస్తుతం ఎమ్మెల్యే రాములు నాయక్ ఫాలోవర్స్ గా కొనసాగుతున్న పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పొంగులేటి వర్గం వైపు వెళ్లేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పొంగులేటి ఏ పార్టీలో చేరతారనే విషయం తెలియపోవడంతో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీను వీడితే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటనే ఆలోచనలో అత్యధికులు ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సమీపించేంత వరకు వేచి చూడాలనే ఆలోచనలోనే నాయకులు ఉన్నారు.
కాంగ్రెస్ లో కొనసాగుతున్న నిస్తేజం
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ లో నిస్తేజం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలకు సమాంతరంగానే వైరాలో కూడా వర్గ రాజకీయాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నా మాలోత్ రాందాస్ నాయక్, బానోత్ బాలాజీ నాయక్, ధరావత్ రామ్మూర్తి నాయక్ ఎవరికి వారు నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ శ్రేణులను తీవ్ర అయోమయానికి గురి చేస్తున్నారు. ఈ వర్గ రాజకీయాలతో పార్టీ శ్రేణులకు తలనొప్పిగా మారింది. పార్టీలో నేలకొన్న నిస్తేజం వల్ల నియోజకవర్గంలో పార్టీ భవిష్యత్తు ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
అయోమయంలో బీఆర్ఎస్ క్యాడర్
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయుల్లో కూడా వైరా నియోజకవర్గ రాజకీయం అంతు చిక్కడం లేదు. బీఆర్ఎస్ పార్టీలో బహిరంగగా కొనసాగుతున్న నాయకుల మదిలో ఏముందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇటీవల వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ నియోజకవర్గంలోని సర్పంచ్, ఎంపీటీసీ లతోపాటు ఇతర ప్రజాప్రతినిధులకు దళిత బంధు యూనిట్లను కేటాయించారు. ఈ కేటాయింపులతో బీఆర్ఎస్ పార్టీ నుంచి పొంగులేటి వర్గం వైపు వలసలు వెళ్లకుండా తాత్కాలికంగా అడ్డుకట్ట పడిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే, ఆ ప్రజాప్రతినిధుల మనసులో వ్యక్తిగతంగా పొంగులేటి పైన అభిమానం ఉన్నా.. దళిత బంధు, ప్రభుత్వ పథకాలను దూరం చేసుకునేందుకు మాత్రం సాహసించడం లేదు. రేపో మాపో ప్రభుత్వం సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇళ్ల నిర్మాణ యూనిట్లు తమకు కేటాయించే అవకాశం ఉందని ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ విషయాలు పొంగులేటి వర్గం కు ప్రతిబంధకంగా మారే అవకాశమూ లేకపోలేదు. బీఆర్ఎస్ ఉన్న నాయకుల కన్నా.. పొంగులేటి వర్గంలోనే ఉన్న నాయకుల భవిష్యత్తుపై రాజకీయ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది.