- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దిశ ఎఫెక్ట్: పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు కలెక్టర్ స్ట్రాంగ్ వార్నింగ్..

దిశ, కొత్తగూడెం: దిశ పత్రిక పెట్రోల్ బంకుల అక్రమాలపై ప్రచురించిన వరుస కథనాలకు జిల్లా కలెక్టర్ అనుదీప్ స్పందించారు. ఆయిల్ కొరత సృష్టించినా, ఆయిల్ను కల్తీ చేసినా బంకు లైసెన్సులు రద్దుతో పాటు సీజ్ చేస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో ఆయిల్ విక్రయాలు, స్టాకు నిర్వహణ అంశాలపై రెవిన్యూ, పౌర సరఫరాలు, పెట్రోల్ బంకు యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పెట్రోల్ బంకులో వినియోగదారులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత యజమానులదేనని స్పష్టం చేశారు. బంకుల్లో మరుగుదొడ్లు, మంచినీరు, వాహనాలకు ఉచితంగా గాలి పెట్టడం చేయాలని, ఇట్టి సేవలను ప్రజల నుండి నగదు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మరుగుదొడ్లు నిర్వహించాలని బంకు యజమానులకు నోటీసులు జారీ చేయాలని పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు. బంకుల్లో ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత బంకు యజమానులదే అయినందున ప్రజలు మరుగుదొడ్లు తెలుసుకునే విధంగా సైనో బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. పెట్రోల్ బంకులు కూడా అత్యవసర సేవలు కిందకే వస్తాయని.. యజమానులు అది గుర్తించాలని చెప్పారు. అక్రమాలకు పాల్పడితే లైసెన్సులు రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో కూడా లైసెన్సులు జారీ చేయమని అన్నారు.
ఇటీవల గండుగులపల్లిలో ఆయిల్ విక్రయాలకు అధిక రేటు తీసుకుంటున్నట్లు గుర్తించి అధికారులతో విచారణ నిర్వహించి బంకు సీజ్ చేశామని తెలిపారు. అధిక డబ్బులు తీసుకున్నందున యజమాని నుండి రెవిన్యూ రికవరీ చట్ట ప్రకారం రూపాయి రూపాయి వసూలు చేస్తామని డీఆర్డీఓకు సూచించారు. తహసీల్దారులు, పౌర సరఫరాలు, తూనికలు కొలతల అధికారులు బంకుల్లో తనిఖీలు నిర్వహించి సౌకర్యాలు, ఆయిల్ స్టాకు నిర్వహణ అంశాలపై నివేదికలు ఇవ్వాలని చెప్పారు. ఆయిల్ కంపెనీల చట్టం ప్రకారం లూజు ఆయిల్ విక్రయాలు అరికట్టాలని సూచించారు. బంకులు నిర్వహణ, సౌకర్యాలు కల్పన, స్టాకు నిర్వహణ తదితర అంశాలపై అధికారులు బంకులను ఆకస్మిక తనిఖీలు చేయాలని చెప్పారు. పెట్రోలియం సేవలు కూడా అత్యవసరమైనవే అయినందున కొరత ఏర్పడితే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని.. కొరత లేకుండా సమృద్ధిగా ఆయిల్ నిల్వలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బల్క్ ఇవ్వడం వల్ల అయిల్ కొరత ఏర్పడుతుందని, అత్యవసర సేవలను గమనంలోకి తీసుకుని ప్రభుత్వ అవసరాలకు మాత్రమే బల్క్గా ఆయిల్ ఇవ్వాలని అన్నారు. అత్యవసర సేవలకు వినియోగించుటకు గాను ప్రతి బంకులో 2 వేల లీటర్లు డీజిల్, వేయి లీటర్లు పెట్రోల్ స్టాకు ఉండాలని చెప్పారు. తహసిల్దార్ జారీ చేసిన కూపను ఆధారంగా రిజిష్టరులో నమోదులు చేసి ఆయిల్ ఇవ్వాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్, తూనికలు కొలతల అధికారి మనోహర్, డిఆర్డీ అశోకచక్రవర్తి, పెట్రోల్ బంకుల కార్యదర్శి రాధాక్రిష్ణ, వైస్ ప్రెసిడెంట్ హరీస్ రాఠీ, జిల్లాలోని 64 బంకుల యజమానులు, పౌర సరఫరాల శాఖ డిటీలు తదితరులు పాల్గొన్నారు.