- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తెలంగాణ విధానాలను దేశం అనుసరిస్తుంది : కలెక్టర్ వీపీ గౌతమ్

దిశ, వైరా : తెలంగాణ రాష్ట్రం ఆచరిస్తున్న విధానాలను దేశం అనుసరిస్తుందని, పేద నిరుపేదల అవసరాలు, ఆవశ్యకతను ముందుగానే ఆలోచన చేసి వారి అవసరాలకనుగుణంగా ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలను రూపొందించి అన్ని సామాజిక వర్గాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక చేయూతనందిస్తున్నారని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబురాల్లో మధిర నియోజకవర్గంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజుతో కలిసి వెనుకబడిన తరగతుల కుల, చేతి వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సహాయం రూ. లక్ష చెక్కులను 100 మంది లబ్ధిదారులకు కలెక్టర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఒకప్పుడు తల్లిదండ్రులకు ఆడపిల్ల పెండ్లి చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. అంతేకాకుండా బాల్య వివాహాలను చేసే వారని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ తో దానిని నిరోధించగలిగామని పేర్కొన్నారు. పథకం లబ్ధి చేకూరాలంటే అమ్మాయికి 18 సంవత్సరాల వయస్సు నిండిన తరువాతనే పెండ్లి చేయాలని కోరారు. మధిర నియోజకవర్గ పరిధిలో 9 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. వయోవృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధి బాధితులకు జిల్లాలో ప్రతి నెలా ఆసరా పింఛన్ల కింద 40 కోట్ల రూపాయలను చెల్లించడం జరుగుతుందన్నారు.
చేతివృత్తిపై ఆధార పడిన వారికి లక్ష ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. జూన్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎవ్వరూ ఊహించని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసి వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరావు, అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ రాధిక గుప్తా, మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత, కమిషనర్ రమాదేవి, మధిర నియోజక తహసీల్దార్లు, ఎంపీడీఓలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు. ఎంపీటీసీలు, జెడ్పీటిసిలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.