రెండు సంవత్సరాలుగా వాహనదారుల నరకయాతన.. ఈ రోడ్డుకు మోక్షమెప్పుడో..?

by Sumithra |
రెండు సంవత్సరాలుగా వాహనదారుల నరకయాతన.. ఈ రోడ్డుకు మోక్షమెప్పుడో..?
X

దిశ, ములకలపల్లి : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లు ఉంది తిమ్మంపేట రహదారి పరిస్థితి. ప్రభుత్వం ప్రజల బాధలు చూసి నిధులు కేటాయించింది. టెండర్లు పూర్తై రెండు నెలలు దాటింది. పనులు దక్కించుకున్న గుత్తేదారు రోడ్డు పనులు మొదలు పెట్టకుండా కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఆ శాఖ అధికారులు మాత్రం కాంట్రాక్టర్ మాటలకు విలువిస్తూ ప్రజల బాధలను పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. ఆ దారి వెంట ప్రయాణమంటే నరకం చూడాల్సి వస్తుందని వాహన చోదకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటు ఆంధ్రా సరిహద్దు.. అటు మండల కేంద్రం..

ములకలపల్లి భద్రాచలం మధ్య ఉన్న ఈ రహదారి ఆంధ్రప్రదేశ్‌లోని ముంపు ప్రాంతాన్ని కలుపుకొని వెళ్లేందుకు ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుంది. ములకలపల్లి నుంచి కేవలం 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చాలు భద్రాచలం వచ్చినట్లే. ములకలపల్లి నుంచి పొగళ్లపల్లి వరకు కొంత రహదారిని ఇటీవల నిర్మాణం చేశారు. మిగిలిన సుమారు 8 కిలోమీటర్ల రహదారిని అధికారులు నిధులు లేవని వదిలేశారు. రెండు సంవత్సరాలుగా ఈ మార్గంలో పెద్ద పెద్ద గుంతల ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం పేపర్ బోర్డుకు జమాయిల్ పుల్ల లోడ్లు ట్రాక్టర్ల ద్వారా ఈ మార్గం గుండా ఎక్కువగా తీసుకువెళ్తుంటారు. తిమ్మంపేట, గుండాలపాడు గ్రామ పంచాయతీల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లేందుకు ఉన్న ఎకైక రహదారి ఇలా ఉండటంతో మండల కేంద్రంతో ప్రజలకు సంబంధాలు తెగిపోతున్నాయి.

టెండర్లు పూర్తై రెండు నెలలు

పొగళ్లపల్లి నుంచి ఆంధ్రా సరిహద్దు వరకు మొత్తం 9.1 కిలోమీటర్ల రోడ్డుకు గడిచిన రెండు నెలల క్రితం ఒక కాంట్రాక్టర్ రూ.4 కోట్లతో టెండర్ దక్కించుకున్నారు. రెండు నెలలుగా పనులు మొదలు పెడతారని స్థానికులు ఎదురుచూస్తున్నా ఫలితం లేదు. ఇదే విషయమై స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దృష్టికి స్థానికులు అనేకమార్లు తీసుకెళ్లినా కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చిపడుతున్నాయి.



Next Story

Most Viewed