తెలంగాణపై కేంద్రం వివక్షపై నామ మండిపాటు

by Sridhar Babu |   ( Updated:2022-11-26 15:10:20.0  )
తెలంగాణపై కేంద్రం వివక్షపై నామ మండిపాటు
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లా పట్ల రైల్వే శాఖ నిర్లక్ష్య వైఖరిపై టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. శనివారం జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ కమిటీ సమావేశానికి ఎంపీలు నామ ,కవిత అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాపైనే కాకుండా యావత్ తెలంగాణ పట్ల కేంద్రం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తుందని ద్వజమెత్తారు. భద్రాచలం - కొవ్వూరు రైల్వే మార్గం కోసం ఎంపీ గా తాను చేయని పోరాటం లేదని, 15వ లోక్ సభలో ప్రధాన మంత్రికి, కేంద్ర మంత్రులకు ఏకంగా 125 కి పైగా లేఖలు రాశానని గుర్తు చేశారు. కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 70 శాతం సింగరేణి నిధులతో భద్రాచలం - సత్తుపల్లి రైల్వే మార్గం పూర్తి చేశారని అన్నారు. సత్తుపల్లి నుంచి కొవ్వూరు వరకు మార్గాన్ని చేపట్టకుండా వదిలేశారని , ఇది తెలంగాణ పట్ల వివక్ష కాక మరేమిటని ప్రశ్నించారు. కేంద్రం ఒక్క పైసా ఇవ్వకుండా రైల్వే ప్రాజెక్టులను అడ్డుకుంటుందని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలు గురించి చర్చిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన పలు అంశాలపై ఎంపీ నామ సంబంధిత అధికారుల చేత వివరణ ఇప్పించారు. సింగరేణి ప్రధాన కేంద్రంలో జరిగే ముఖ్యమైన దిశ సమావేశానికి ఎందుకు సీనియర్ అధికారులు రావడం లేదని ప్రశ్నించారు. సీనియర్ అధికారులైన డైరెక్టర్లు, జీఎం ఎందుకు సమావేశానికి రావడం లేదన్నారు. ఈ విషయాన్ని చైర్మన్ దృష్టికి తీసికెళ్లాలని, వచ్చే సమావేశానికి పరిస్థితిలో మార్పు రావాలన్నారు. సీఎస్ఆర్ ఫండ్స్ ఎందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే లు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, రేగా కాంతారావు, హరిప్రియ, ఎమ్మెల్సీ తాత మధు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ సీతామహాలక్ష్మి, కలెక్టర్ అనుదీప్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed