ఆ ఫోర్మెన్ డూటీ రోజుకు ఫోర్​ అవర్సే..

by Sridhar Babu |
ఆ ఫోర్మెన్  డూటీ రోజుకు ఫోర్​ అవర్సే..
X

దిశ, వైరా : ఆయన ఎన్పీడీసీఎల్ సంస్థలో ఉద్యోగి... నెలకు ఆయన జీతం అక్షరాల రూ.1.50 లక్షల పై మాటే.... కానీ ఆయన రోజుకు ఎన్ని గంటలు విధులు నిర్వహిస్తారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు.... రోజుకు 2 నుంచి 4 గంటలు మాత్రమే ఆయన తన విధులకు హాజరవుతారు. మిగిలిన సమయం అంతా ఖమ్మంలో హాయిగా గడుపుతారు. ఉదయాన్నే 10:30కు సబ్ స్టేషన్​కు వచ్చి అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపు తిరిగి ఇంటికి వెళ్తారు. ఆయనకు వైరా పట్టణంలో విద్యుత్ వ్యవస్థపై కనీస అవగాహన లేదు. పట్టణంలో ఎన్ని ట్రాన్స్​ఫార్మర్లు ఉన్నాయి...? ఒక్కో ట్రాన్స్​ఫార్మర్ లోడ్ కెపాసిటీ ఎంత...? అత్యధిక లోడ్ ఉన్న ట్రాన్స్​ఫార్మర్లు పట్టణంలో ఎక్కడ ఉన్నాయి....? ఎక్కడెక్కడ నూతన ట్రాన్స్​ఫార్మర్లు ఏర్పాటు చేయాలి..?

తదితర అంశాలపై ఆయనకు కనీస అవగాహన కూడా లేదు. కేవలం రోజుకు 2 నుంచి 4 గంటల వరకు మాత్రమే విధులకు హాజరవుతున్న అధికారి పై కనీస చర్యలు తీసుకునేవారు కరువయ్యారు. వైరాలో డీఈ కార్యాలయం ఉన్నప్పటికీ సబ్ స్టేషన్ లోని ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించడంలో పూర్తిగా అధికారులు విఫలమవుతున్నారు. ఇది వైరా లోని విద్యుత్ సబ్​స్టేషన్ లో పనిచేసే ఫోర్ మెన్ విధులు నిర్వహిస్తున్న తీరు. ఆయన గత మూడేళ్లగా రోజుకు 2 నుంచి 3 గంటలు మాత్రమే విధులకు హాజరవుతున్నా కనీసం అధికారులు పట్టించుకోలేని దుస్థితిలో ఉండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది.

విద్యుత్ సరఫరా నిలిచిపోతే లైన్ మెన్ ఒక్కడే బాధ్యుడా....

ఖమ్మంలో నివాసం ఉంటూ రోజుకు 2నుంచి 4 గంటలు మాత్రమే విధులు నిర్వహించి ఇంటికి వెళ్తున్న ఫోర్ మెన్ వల్ల కింది స్థాయి సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైరా పట్టణంలో విద్యుత్ వ్యవస్థ పై పూర్తి అవగాహన ఉండటంతో పాటు ట్రాన్స్​ఫార్మర్ల ఫీజులు పోయినా, ఇతర సమస్యలు తలెత్తినా ముందుగా ఫోర్ మెన్ ను స్పందించాల్సి ఉంటుంది. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా తప్పనిసరి పరిస్థితుల్లో విధులు చేయాల్సి ఉంటుంది. కానీ ఆయన మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వైరాలోనే కనిపించరు. గత మూడు రోజుల క్రితం వైరాలోని మూడు ప్రాంతాల్లో అర్ధరాత్రి విద్యుత్ సమస్యలు తలెత్తాయి. మూడు ప్రాంతాల్లోని ట్రాన్స్​ఫార్మర్​లో ఫీజులు కాలిపోయాయి. అయితే విద్యుత్ వినియోగదారులు ఫోన్ చేస్తే ఫోర్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్ కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు.

దీంతో స్థానికంగా ఉన్న ఒక్క లైన్ మెన్ మాత్రమే మూడు ప్రాంతాల్లో ట్రాన్స్​ఫార్మర్ లో ఫీజులు వేశారు. ఈ విషయమై వైరాలోని హనుమాన్ బజారుకు చెందిన విద్యుత్ వినియోగదారులు అధికారులపై అదే అర్ధరాత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుసటి రోజే డీఈ కృష్ణ వైరా విద్యుత్ సిబ్బందికి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఫోర్ మెన్ పని తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా.... ఆయన పని విధానంలో కనీస మార్పు రాలేదు. గత మూడు రోజుల నుంచి కూడా మధ్యాహ్నం ఒంటి గంటకే ఇంటికి వెళ్తున్నారు. లక్షలాది రూపాయలు నెలకు జీతం గా తీసుకుంటున్న ఆయన విధులు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఉన్నతాధికారులు కూడా చోద్యం చూస్తున్నారు. సమస్య వస్తే లైన్మెన్ ఒక్కడే వైరాలో పనిచేసేందుకు దిక్కుగా ఉన్నారు.

డీఈ, ఏడీ స్థాయి అధికారుల పర్యవేక్షణ వైరా సబ్ స్టేషన్ లోని ఉద్యోగులపై కనీసం కరువైందని ఆరోపణ ఉన్నాయి. ప్రస్తుత వేసవి కాలంలో వైరాలోని పలు ప్రాంతాల్లో ట్రాన్స్​ఫార్మర్లపై విద్యుత్ లోడ్ పడుతుంది. దీంతో ఫీజులు కాలిపోతున్నాయి. లోడ్ పడుతున్న ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్​ఫార్మర్లు ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ఎన్పీడీసీఎల్ సీఎండీ స్పందించి చుట్టపు చూపుగా ఉద్యోగానికి వస్తున్న ఫోర్ మెన్ పై చర్యలు తీసుకుని వైరాలో విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టాలని విద్యుత్ వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.



Next Story