వైరా మున్సిపాలిటీ కార్యాలయంలో ఆ బోర్డు లేదట

by samatah |
వైరా మున్సిపాలిటీ కార్యాలయంలో ఆ బోర్డు లేదట
X

దిశ, వైరా : "మీరు ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా వెళ్లండి.. కార్యాలయంలోని ఉన్నతాధికారి వద్దకు వెళ్ళినప్పుడు ఆ గదిని ఎప్పుడైనా క్షుణంగా పరిశీలించారా.. ఉన్నతాధికారి గదిలో ఆ కార్యాలయం ప్రారంభించినప్పటి నుంచి ఎవరెవరు అధికారులు అక్కడ పనిచేశారో బోర్డు ఉంటుంది. మండల స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అధికారుల పేర్లతో కార్యాలయాల్లో బోర్డులు ఉంటాయి".

కానీ వైరా మున్సిపాలిటీలో మాత్రం ఇక్కడ పనిచేసిన కమిషనర్ల పేర్లతో ఎలాంటి బోర్డు కనిపించదు. ఇంతవరకు కమిషనర్ల పేరుతో బోర్డు ఏర్పాటు చేయకపోవటం విస్మయాన్ని కలిగిస్తుంది. 2018 ఆగస్టు రెండో తేదీన సోమవారం మేజర్ గ్రామపంచాయతీ ని వైరా మున్సిపాలిటీ గా అప్ గ్రేట్ చేశారు. అప్పటినుంచి ప్రస్తుతం వరకు నాలుగు సంవత్సరాల ఐదు నెలల 25 రోజులు కాలం గడిచింది. మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు పదిమంది కమిషనర్లు ఇక్కడ పని చేశారు. అయితే ఈ కమిషనర్ల జాబితాతో మున్సిపాలిటీ కార్యాలయంలో ఎక్కడ బోర్డు ఏర్పాటు చేయలేదు. ఇక్కడ కమిషనర్లు ఎప్పుడు చార్జి తీసుకున్నారు,ఎప్పుడు రిలీవ్ అయ్యారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

నిబంధన ప్రకారం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి ఏ కమిషనర్ ఎప్పుడు ఇక్కడ బాధ్యతలు తీసుకున్నారు.. ఏ కమిషనర్ ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యారనే వివరాలు తేదీల వారీగా బోర్డులో పొందుపరచాల్సి ఉంది. అయితే ఈ నిబంధనలు మున్సిపాలిటీలోని అధికారులకు ఎవరికీ వర్తించటం లేదు. అధికారులకు ఎందుకు ఇంత నిర్లక్ష్యమో అర్థం కాని పరిస్థితి ఉంది. అనేక మంది ఈ బోర్డు గురించి అధికారులను ప్రశ్నించనా,పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు . ఇప్పటికైనా వైరా మున్సిపాలిటీ అధికారులు ఇక్కడ పని చేసిన కమిషనర్ల పేరుతో బోర్డును ఏర్పాటు చేస్తారో , లేదంటే తమ నిర్లక్ష్యాన్ని యధావిధిగా కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే.



Next Story

Most Viewed