రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు అప్రజాస్వామికం

by Sridhar Babu |   ( Updated:2023-03-25 10:54:13.0  )
రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు అప్రజాస్వామికం
X

దిశ, వైరా : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నోటీస్ ఇవ్వటం అప్రజాస్వామికమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయటాన్ని నిరసిస్తూ టీపీసీసీ సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో వైరాలోని మధిర క్రాస్ రోడ్ లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శనివారం నిరసన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ప్రారంభించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయాల్లో కక్షపూరిత వాతావరణాన్ని సృష్టిస్తుందని విమర్శించారు. రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసింది శూన్యంమని ఆరోపించారు. దేశంలో గ్యాస్, డీజిల్, పెట్రోల్, ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్య మానవులపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపిందని విమర్శించారు.

దేశం కోసం ప్రాణాలర్పించిన చరిత్ర ఉన్న గాంధీ కుటుంబంపై కక్షపూరితంగా ప్రధానమంత్రి మోడీ వ్యవహరించడం దిగుజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ కోసం దేశం కోసం అనేక త్యాగాలు చేశారని కొనియాడారు. దేశంలో ప్రతిపక్షాల నాయకులపై సీబీఐ, ఈడీ దాడులు చేయటమే తమ పనిగా కేంద్రం ముందుకు సాగుతుందన్నారు. దాడులకు లొంగిన వారిని తమ పార్టీలో చేర్చుకొని కేసులను మాఫీ చేస్తున్న బీజేపీ, దాడులకు లొంగని వారిని జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన ఎనిమిది ఏళ్లలో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో 95 శాతం ప్రతిపక్షాలపై ఉన్నాయంటే దేశంలో ఎలాంటి పరిస్థితి నెలకొందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గాంధీ కుటుంబం పై కక్ష పూర్వకంగా వ్యవహరిస్తున్న బీజేపీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలే ఓటుతో తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.

ఈ శిబిరానికి సీపీఎం, సీపీఐ, టీడీపీ నాయకులు హాజరై తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, నాయకులు దాసరి దానియేలు, వేముల కృష్ణ ప్రసాద్, లచ్చి నాయక్, స్వర్ణ నరేందర్, ఏదునూరి సీతారాములు, బోళ్ల గంగారావు, ఫణితి శ్రీను, పల్లపు కొండలు, పొదిలి హరినాథ్, పాలేటి నరసింహారావు, బ్రహ్మరాశి హనుమంతరావు, పమ్మి అశోక్, గుగులోతు రాము, కన్నెగంటి నాగేష్ తదితరులు పాల్గొన్నారు.



Next Story