కేసీఆర్‌ దొంగ దీక్షకు తెలంగాణ రాలేదు

by Sridhar Babu |
కేసీఆర్‌ దొంగ దీక్షకు తెలంగాణ రాలేదు
X

దిశ, కారేపల్లి : కేసీఆర్‌ చేసిన దొంగ దీక్షకు తెలంగాణ రాష్ట్రం రాలేదని, 14 వందలమంది బలిదానంతో చెలించి సోనియా తెలంగాణ ఇచ్చిందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం కారేపల్లి మండలం భాగ్యనగర్‌తండాలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పొంగులేటి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ చచ్చిపోతుందని తెలిసినా సోనియా తెలంగాణను ఇచ్చిందని గుర్తుచేశారు. మాయ మాటలు, టక్కరి మాటలతో రెండు పర్యాయాలు సీఎం అయి కేసీఆర్‌ ఆయన కుటుంబం బాగుపడింది తప్పా తెలంగాణ ప్రజల కలలు, కలలుగానే మిగిల్చారని ఆరోపించారు. పది డబుల్‌ ఇండ్లు కట్టి అందరికీ ఇస్తామని కల్లబొల్లి కబుర్లతో మీడియాలో బ్రమలు చూపటంమే తప్ప గడిచిన 9 ఏండ్లలో మారు మూల గ్రామాల్లో డబుల్‌ ఇండ్లు జాడ లేదన్నారు.

దివంగత సీఎం రాజశేఖర్‌ రెడ్డి నాయకత్వంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టించారన్నారు. కేసీఆర్‌ అరకొర పోడు భూములిచ్చి గొప్పలు పోతున్నాడని, 14 లక్షల ఎకరాలకు అర్హత ఉందని గిరిజనులు దరఖాస్తులు చేసుకుంటే కేవలం 4 లక్షలు ఎకరాలకు హక్కులిచ్చి పోజుకొడుతున్నారన్నారు. పింక్‌ కలర్‌ షర్డు వేసుకున్న వారికి తప్ప ఏ ఒక్క ఇతర పార్టీ వారికి పోడు హక్కులు ఇవ్వలేదని ఆరోపించారు. పోడు మీ నాన్న, తాత సంపాదించిన ఆస్తి కాదని... కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే ప్రజల మనోభావాలు గౌరవించేలా సాగు చేస్తున్న పేదలందరికి పట్టా వస్తుందని, అర్హులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇస్తుందన్నారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పి అమలు చేయలేదన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయటమే ధ్యేయంగా కలిసి పనిచేయాలన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన 500 కుటుంబాలు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో భాగ్యనగర్‌తండా, సామ్యాతండా, లావుడ్యాతండాలకు చెందిన 500 కుటుంబాలు ఎంపీటీసీ ఆలోత్‌ ఈశ్వరీనందరాజ్‌, బాబు, మంగీలాల్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరినట్లు నాయకులు తెలిపారు. ఈసందర్బంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు గ్రామాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బర్ర రాజశేఖర్‌,

డీసీసీబీ డైరక్టర్‌ తుళ్లూరి బ్రహ్మయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు తలారి చంద్రప్రకాశ్‌, నాయకులు బానోతు విజయబాయి, ఇమ్మడి తిరుపతిరావు, మల్లెల నాగేశ్వరరరావు, గుగులోత్‌ బీముడు, మండెపూడి సత్యనారాయణ, బానోత్‌ రాంచందర్‌, నాగండ్ల జగన్‌, షేక్‌ సైదులు, మంగీలాల్‌, బాబు, ఎంపీటీసీ అలోత్‌ ఈశ్వరీనందరాజ్‌, మాధారం, సింగరేణి సర్పంచ్‌లు అజ్మీర నరేష్‌, ఆదెర్ల స్రవంతి, సోసైటీ డైరక్టర్‌ బానోత్‌ హీరాలాల్‌ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed