సాంకేతికతను వాడుకున్నారు...రూ.6.96 లక్షల నగదు చోరీ చేశారు...

by Sridhar Babu |
సాంకేతికతను వాడుకున్నారు...రూ.6.96 లక్షల నగదు చోరీ చేశారు...
X

దిశ, వైరా : రోజు రోజుకు పెరిగిపోతున్న శాస్త్ర సాంకేతికలోని లోపాలతో దొంగల ముఠాలు సులువుగా చోరీలకు పాల్పడుతున్నాయి. అంతర్ రాష్ట్రాలకు చెందిన కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి డీసీసీబీ బ్యాంకులోని ఏటీఎంలను కొల్లగొట్టారు. ఏకంగా రూ.6.96 లక్షల నగదును చోరీ చేశారు. ఈ చోరీ విషయం ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాలోని వైరా, తల్లాడ మండల కేంద్రాల్లో ఉన్న డీసీసీబీ బ్యాంక్ ఏటీఎంల్లో ఈ చోరీ జరిగింది. జూలై ఒకటో తేదీన వైరాలోని డీసీసీబీ ఏటీఎంలో 17 ఏటీఎం కార్డులతో రూ.4.16 లక్షలను, తల్లాడ ఏటీఎంలో 11 ఏటీఎం కార్డులతో రూ.2.80 లక్షలను చోరీ చేశారు.

ఎలా చేశారంటే...

ముందుగా దొంగలు తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును మిషన్ లో పెట్టారు. ఈ కార్డు పిన్ నెంబర్ కొట్టి వెంటనే నగదు ఉపసంహరణ చేసేందుకు బటన్ నొక్కుతారు. అయితే ఆ నగదును మిషన్ లెక్కించి బయటకు వచ్చే సమయంలో దొంగలు తెలివిగా ఆ ఏటీఎం మిషన్ కు కరెంట్ సప్లై చేసే స్విచ్​ ఆఫ్ చేశారు. దీంతో ఏటీఎం నుంచి నగదు మిషన్​ మధ్యకు వచ్చి ఆగిపోయాయి. అనంతరం మళ్లీ స్విచ్​ వేశారు. దాంతో మధ్యలో ఆగిన నగదు బయటకు వచ్చాయి. అయినప్పటికీ అకౌంట్లోని నగదు కట్ కాలేదు. ఈ హైటెక్ విధానంతోనే దొంగలు 17 ఏటీఎం కార్డుల ద్వారా 30 సార్లు నగదు చోరీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆయా బ్యాంకు మేనేజర్లు తెలిపారు.

అంతర్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది యువకులు ఒక ముఠాగా ఏర్పడి చోరీకి పాల్పడ్డారు. బ్యాంకు సిబ్బంది ఏటీఎంల్లో నగదు పెట్టే సమయంలో నగదు కౌంటింగ్ తేడా రావడంతో అనుమానం వచ్చిన వైరా బ్యాంకు మేనేజర్ సీసీ పుటేజ్ లను తనిఖీ చేశారు. దీంతో ఒకటో తేదీన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా ఏటీఎం కార్డుల ద్వారా నగదు డ్రా చేసిన సీసీ పుటేజీలు బయటపడ్డాయి. దీంతో నగదు లెక్కించగా వైరా ఏటీఎంలో రూ.4.16 లక్షల నగదు మాయమయ్యాయి. అదే సమయంలో తల్లాడ డీసీసీబీ ఏటీఎంలో రూ. 2.80 లక్షల తక్కువయ్యాయి. దాంతో తల్లాడ, వైరా పోలీస్​స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వైరా, తల్లాడ ఎస్సై లు మెడా ప్రసాద్, సురేష్ బ్యాంకు ఏటీఎంలను పరిశీలించి సీసీ పుటేజ్ లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed