- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నగరంలో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు.. వ్యాపారులపై కేసు..

దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం సిసిఎస్, టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు చేపట్టాయి. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు సీఐ పుల్లయ్య ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం అక్రమ చిట్ ఫండ్, ఫైనాన్స్ లను నిర్వహిస్తున్న విశ్వసనీయ సమాచారంతో పలువురు వడ్డీ, చిట్టి వ్యాపారస్తుల దుకాణాలు ఇళ్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పలు రికార్డులు డాక్యుమెంట్లను పరిశీలించారు.
భద్రాచలం రోడ్డు లో ఫైనాన్స్ షాప్ నిర్వహించే సదా మోహన్ బాబు వద్ద నుంచి తాకట్టు పెట్టుకున్న 105 బంగారు ఆభరణాలు ప్యాకెట్, 14 వెండి ఆభరణాల ప్యాకెట్.. మరియు రూ.3,49,970 నగదు అక్రమ బాండు పేపర్లు, సంతకాలు చేయని చెక్కులు ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బస్టాండ్ సెంటర్లో బుక్ స్టాల్ నిర్వహించే కంచర్ల రమేష్ గుప్తా వద్ద నుంచి రూ.1,66,750 నగదు, అక్రమ ప్రాంసరీ నోట్లు, సంతకాలు లేని చెక్కులు.. లైసెన్స్ లేకుండా అధిక వడ్డీతో నిర్వహిస్తున్న చిట్టీలు, ఫైనాన్స్ కు సంబంధించి మొత్తం రూ. 5,16,720 నగదు మరియు సుమారుగా రూ.25,00,000 విలువచేసే బంగారు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
వీరిరువురు పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని.. దాడుల్లో పట్టుబడిన నగదును అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ సత్యనారాయణకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ పుల్లయ్య తెలిపారు. మంగళవారంతో ఈ దాడులు ముగిసిపోలేదని బుధవారం కూడా కొనసాగనున్నాయని ప్రచారం జరుగుతుంది. దీంతో కొందరు వ్యాపారులు ఇళ్లకి దుకాణాలకు తాళం వేసి పరారైనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా టాస్క్ ఫోర్స్ దాడులతో అశ్వారావుపేట మండల కేంద్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.