జీళ్ల చెరువు దేవాలయంలో ఘనంగా స్వామివారి కళ్యాణం

by Sridhar Babu |
జీళ్ల చెరువు దేవాలయంలో ఘనంగా స్వామివారి కళ్యాణం
X

దిశ, కూసుమంచి : మండల పరిధిలోని జీళ్ల చెరువు లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య, మంగళ వాయిద్యాలు మోగుతుండగా స్వామి వారు అమ్మవారి మెడలో మంగళసూత్రధారణ చేశారు. అంతకుముందే స్వామి, అమ్మవార్లను పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి, రంగురంగుల పూలతో అలంకరించిన వేదిక పైన ఆసీనులను చేసి శాస్త్రోక్తంగా పుణ్యావాచనం, కంకణ ధారణ రక్షాబంధన్ ,

పాదపక్షాళన, జీలకర్ర బెల్లం వంటి కళ్యాణ తంతును నడిపించారు. భక్తుల గోవింద నామ స్మరణ మధ్య వేద పండితులు సాయినాథ్​, సీతారామానుజ చార్యుల ఆధ్వర్యంలో కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం తలంబ్రాల ఘట్టం నిర్వహించారు. కళ్యాణ పీటల మీద భక్తులు పెద్ద సంఖ్యలో కూర్చున్నారు. చుట్టుపక్కల కాలనీలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి పరవశించిపోయారు. దీంతో ఆలయమంతా భక్తులతో కిటకిటలాడింది. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను, అన్నదాన ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో నారాయణాచార్యులు, చైర్మన్ బుర్లే వీరబాబు, డైరెక్టర్ లు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed