విద్యార్థులు తొలిమెట్టు ఎక్కేలా కృషి చేయాలి : కలెక్టర్​ వీపీ గౌతమ్

by Sridhar Babu |
విద్యార్థులు తొలిమెట్టు ఎక్కేలా కృషి చేయాలి : కలెక్టర్​ వీపీ గౌతమ్
X

దిశ, కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొలిమెట్టు మౌలిక, భాషా, గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాలేరు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మౌలిక, భాష, గణిత సామర్ధ్యాలను విద్యార్థులకు నేర్పడంలో ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థులు తొలిమెట్టు ఎక్కేలా విద్యా బోధన చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఏ మేరకు ఫలితాలు సాధించారన్న విషయంపై దృష్టి పెట్టాలని కోరారు. ఈనెల చివరి తేదీ వరకు సాధించిన ఫలితాలపై ఉపాధ్యాయులు డిక్లరేషన్ పంపించాలని ఆదేశించారు. పాఠశాల అవరణలో కొనసాగుతున్న మన ఊరు మన బడి పనులను పరిశీలించారు. పనులను నాణ్యతగా చేపట్టి త్వరగా పూర్తి చేయాలని అధికారలను ఆదేశించారు. తొలి మెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో పాఠ్య పుస్తకాలను చదివించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలోని రెవెన్యూ అకాడమీ భవనాన్ని, ఫైర్ స్టేషన్ ను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అకాడమీ సమీపంలోని డంపింగ్ యార్డ్ ను పరిశీలించగా అక్కడ తడి పొడి చెత్త మంటలతో దర్శనమివ్వగా చెత్తను కాల్చింది ఎవరని కూసుమంచి పంచాయతీ కార్యదర్శి శంకర్ ను వివరణ కోరారు. దాంతో ఆయన తనకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సామినేని సత్యనారాయణ , ఏఎంవో రవికుమార్, సీఎంఓ రాజశేఖర్ , ఎంఈఓ రామాచారి, రూరల్ ఎంఈఓ శ్యామ్ సన్, ఎఫ్ ఎల్ ఏన్ మండల నోడల్ అధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు , ప్రాథమిక ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి,ఎంపీవో రామచందర్ రావు పాల్గొన్నారు.



Next Story