- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విద్యార్థులు లక్ష్య సాధన కోసం కృషి చేయాలి: జడ్పీ చైర్మన్ కనకయ్య

దిశ, ప్రతినిధి కొత్తగూడెం : విద్యార్థులు లక్ష్య సాధన కోసం కృషి చేయాలని, లక్ష్యం వైపు గురి పెడితే విజయాలు వాటంతటవే వస్తాయని జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. కొత్తగూడెం క్లబ్ లో ఆదివారం నిర్వహించిన 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన పలు రకాల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
విద్యార్థులు ఇప్పటి నుంచే పోటీ తత్వాన్ని అలవర్చుకుంటే భవిష్యత్తు బంగారు మయం అవుతుందని, పోటీల్లో గెలుపు, ఓటములు సహజమని, నెగ్గిన వారు తమ ప్రతిభకు మరింత పదును పెట్టుకోవాలన్నారు. ప్రతి ఓటమి విజయానికి తొలిమెట్టు లాంటిదని, బహుమతులు రానివారు నిరుత్సాహ పడకుండా మరింతగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరచారని, ఈ అనుభవాలు భవిష్యత్తుకు ఉపయోగపడేలా మలుచు కోవాలని డీఎస్పీ వెంకటేశ్వర బాబు సూచించారు. చిన్ననాటి నుంచే పోటీతత్వాన్ని విద్యార్థులు అలవర్చుకోవడం గర్వకారణమని, రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ చక్కటి చదువులతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సింగరేణి మేనేజర్ ఆనంద్ బాబు ఆకాంక్షించారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వారోత్సవాలు స్ఫూర్తిదాయకమని, ఈ సంప్రదాయాన్ని విద్యార్థుల మేధస్సులు పెంపొందించేందుకు రాబోయే రోజుల్లో కూడా కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా పలు అంశాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఇందులో భాగంగా పలువురు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ఆహుతును ఆకట్టుకున్నాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఏ. మంజువాణి, గ్రంథపాలకులు వరలక్ష్మి దేవి, మణి మృదుల, ఆఫీస్ ఇంచార్జ్ నవీన్, శాఖ గ్రంథ పాలకులు మధు బాబు, వంశీ, జానీ, వాణి, నాగమణి, రుక్మిణి, శైలజ తో పాటు గ్రంథాలయ సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠకులు పాల్గొన్నారు.