- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
శ్రీరామనవమికి పటిష్టమైన బందోబస్తు : ఎస్పీ డా.వినీత్

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : శ్రీరామనవమికి పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ డా.వినీత్.జి ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పోలీసు అధికారులతో ఆయన నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ ఈ నెల 30వ తేదీన జరగబోయే శ్రీరామనవమికి వివిధ ప్రాంతాల నుండి భద్రాచలానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తులు భద్రాచలం చేరుకోవడానికి ఉపయోగించే రహదారుల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
బందోబస్తు ప్రకారం కేటాయించిన విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది రోల్ క్లారిటీతో బాధ్యతగా పనిచేయాలన్నారు. అనంతరం పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ ద్వారా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలిగించే విధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్థానికంగా పోలీస్ అధికారులు తమ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని నిరంతరం సందర్శిస్తూ ఉండాలని,ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టి పోలీస్ శాఖపై నమ్మకాన్ని మరింతగా పెంచాలని కోరారు. ఫిబ్రవరి నెలలో వర్టికల్స్ వారీగా విధులలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రసంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఇ.విజయ్ బాబు, భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్, డీఎస్పీలు రమణ మూర్తి, వెంకటేష్, రాఘవేంద్రరావు, రెహమాన్, నందీరామ్, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.