- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
శ్రీరామ నవమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలి : కలెక్టర్ అనుదీప్

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : ప్రతి భక్తుడు రాములోరి కళ్యాణ వేడుకలు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అసుదీప్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడిఓసీ కార్యాలయంలో శ్రీరామనవమి, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవాల నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత సంవత్సరం భక్తుల మన్ననలు పొందే విధంగా ఘనంగా నిర్వహించుకున్నామని, ఈ సంవత్సరం అదే స్ఫూర్తితో దిగ్విజయంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేద్దామని చెప్పారు. మార్చి 30వ తేదీన శ్రీరామనవమి, 31వ తేదీన పుష్కర పట్టాభిషేకం మహోత్సవాలు జరుగనున్నట్లు చెప్పారు. స్వామివారి వేడుకలు నిర్వహించనున్న మిథిలా స్టేడియంలో సెక్టారు ప్రణాళిక తయారు చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. స్టేడియాన్ని సెక్టార్లుగా విభజించాలని, ప్రతి సెక్టారు పర్యవేక్షణకు జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించనున్నట్లు చెప్పారు.
వేడుకల నిర్వాహణకు కార్యాచరణ తయారు చేయడంతో పాటు పర్యవేక్షణ అత్యంత ముఖ్యమని చెప్పారు. కార్యాచరణ అమలు పర్యవేక్షణ ద్వారా వేడుకలు నిర్వహణకు సిద్ధం కావాలని చెప్పారు. కేటాయించిన విధుల ప్రకారం అధికారులు కసరత్తు ప్రారంభించాలని చెప్పారు. ముందు నుండే సన్నద్ధం కావడం వల్ల ఎలాంటి లోటుపాట్లుకు తావులేకుండా వేడుకలు. ఘనంగా నిర్వహించగలమని చెప్పారు. మార్చి 25వ తేదీ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. మార్చి 1వ తేదీ నుండి భక్తులు టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. భక్తులు టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీఓ కార్యాలయాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోస్టల్, మీ సేవా, కార్గో సర్వీసుల ద్వారా భక్తులకు స్వామివారి తలంబ్రాలు, ప్రసాదాలు చేరవేయు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. తలంబ్రాలు, ప్రసాదాలు పంపిణీ కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణకు బారీకేడింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.
భక్తులకు సమాచారం అందించేందుకు సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని డీపీఆర్డీకు సూచించారు. విధులు నిర్వహించు సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. సెక్టార్లలో ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు ఒక సెక్టారు నుండి మరొక సెక్టారుకు వెళ్లకుండా బారీకేడింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని, బస్సుల్లో భక్తులకు ఉచితంగా తలంబ్రాలు పంపిణీ చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని డీపీఓకు సూచించారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు జోన్లుగా విభజించి పర్యవేక్షణకు ప్రతి జోన్కు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు. అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, పట్టణంలోని ప్రధాన కూడళ్లలో మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. భక్తులు ఎండ నుండి ఉపశమనం పొందేందుకు మజ్జిగ, మంచినీటిని సరఫరా చేయాలన్నారు.