అర్హులు ఉన్నా ఇన్‌చార్జీలవైపే మొగ్గు ఎందుకు..?

by S Gopi |
అర్హులు ఉన్నా ఇన్‌చార్జీలవైపే మొగ్గు ఎందుకు..?
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: సింగరేణి సంస్థలో ఐదు బోర్డు డైరెక్టర్‌ పోస్టుల్లో అత్యంత కీలకమైన పోస్టు అయిన డైరెక్టర్‌ పా, ఆపరేషన్స్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్‌ చంద్రశేఖర్‌ పదవీ కాలం ముగియనుంది. సంస్థలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు ఐదుగురు ఉండాలి. కానీ సంస్థ ఐదుగురికి బదులుగా ముగ్గురిని మాత్రమే డైర్టెర్లుగా నియమించింది. అందులో డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ ఎస్‌ చంద్ర శేఖర్‌, డైరెక్టర్‌ ఫైనాన్స్‌గా ఎన్‌ బలరామ్‌ నాయక్‌, డైరెక్టర్‌ ఈఅండ్‌ఎంగా డి సత్యనారాయణ రావు బాధ్యతలు చేపట్టారు. అయితే మిగిలిన పీఏఅండ్‌డబ్ల్యూ, పీఅండ్‌పీ రెండు డైరెక్టర్‌ పోస్టులకు ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. పా పోస్టును చంద్రశేఖర్‌కు, ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ను బలరామ్‌ను ఇంచార్జీలుగా సంస్థ బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఎంతో కీలకమైన రెండు డైరెక్టర్‌ పోస్టులు ఖాళీ కానున్నాయి.

గతంలో సింగరేణి సంస్థలో డైరెక్టర్‌ పా పోస్టుకు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ సివిల్‌ సర్వీసెస్స్‌ ర్యాంక్‌ అధికారిని నియమించేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో అదే క్యాడర్‌ అధికారిని డైరెక్టర్‌ పీఏఅండ్‌డబ్ల్యూగా నియమించింది. అయితే 2015లో సింగరేణి సంస్థ సీఎంఅండ్‌డిగా ఎన్‌ శ్రీధర్‌ బాధ్యతలు చేపట్టారు. నాటినుండి నేటివరకు డైరెక్టర్‌ పాగా ఆస్థాయి అధికారిని నియమించకపోడం గమనార్హం. సింగరేణి సంస్థలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించే బోర్డు డైరెక్టర్‌ పదవులకు అర్హులు, ప్రతిభ ఉన్న అధికారులను కాదని ఇంచార్జీలతోనే కాలము వెల్లబుచ్చుతున్నారు. సింగరేణి సంస్థ దిశా నిర్దేశానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టడంలో కీలకపాత్ర పోషించే ఆయువుపట్టులాంటి ఆ ఐదు శాఖల డైరెక్టర్ల నిర్ణయాలే కీలకము. అలాంటిది అంతటి కీలకమైన పదవుల నియామకంలో గత కొని ఏళ్ళుగా సంస్థ వ్యవహరిస్తున్న తీరుతో అటు సింగరేణి సంస్థకు ఇటు కార్మిక లోకానికి ఇబ్బందులు తప్పడం లేదు. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది సంస్థ పరిస్థితి. ఫంక్షనల్‌ డైరెక్టర్‌ పోస్టులకు అర్హతవుండి ఎంతోమంది అనుభవజ్ఞులు ఉన్నప్పటికీ నియామకాలు చేప్పకుండా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇంచార్జీలుగా సంస్థ కొనసాగించడం అందరినీ విస్మయానికి గురిచేస్తున్న అంశము. ఫైనాన్స్‌, ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్‌, ఆపరేషన్స్‌, పర్సనల్‌, అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ (పీఏఅండ్‌డబ్ల్యూ), ఈఅండ్‌ఎమ్‌ అనే ఐదు డైరెక్టర్‌ శాఖల పనితీరుపైనే సంస్థ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది.

అధికారులపై పనిభారం భారము...

బోర్డు డైరెక్టర్లు ఐదుగురు ఉండాలి కానీ, కొందరి డైరెక్టర్లకు అదనపు భాద్యతలు ఇచ్చి ముగ్గురితోనే సంస్థ నెట్టుకొస్తుంది. దీంతో ఇద్దరు పనిచేయాల్సిన స్థానంలో ఒక్కరే డ్యూయల్‌ రోల్‌ పోషించడంతో వారిపై తీవ్ర పని ఒత్తిడి పెరుగుతుంది. సంస్థాగత నిర్ణయాలు సైతం సరైన సమయంలో తీకుకోలేపోతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనిభారం సైతం అధికంగా ఉండటంతో దేనిపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించలేక పోతున్నారని, దీంతో సకాలంలో సరైన నిర్ణయాలు వెలువడక కార్మికులు, అధికారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పోస్టుల నియామకంలో కాలయాపనతో సంస్థ ప్రగతి మందగిస్తోందని కార్మిక సంఘాల నాయకులు వాపోతున్నారు. 2018లో నిర్వహించిన ఇంటర్యూలో మొదటి మూడు స్థానాలలో ఉన్న అభ్యర్థులను కాదని తొమ్మిదో స్థానంలో నిలిచిన అభ్యర్థికి డైరెక్టర్‌ పోస్టుకు ఎంపికచేసినట్లు సమాచారం. ప్రతిభ ఉండి అర్హులైన అధికారులు ఎంతో మంది ఉన్నప్పటికీ డైరెక్టర్లుగా నియమించేందుకు సంస్థ సుముఖత చూపకోడంలో ఆంతర్యం ఏమిటో ఎవ్వరీకి అంతు చిక్కని ప్రశ్న. గతంలో ఈ పోస్టులకు ఇంటర్యూలకు హాజరైన సుమారుగా 20 మందికిపైగా అధికారులు ఉన్నా వారికి ఎటువంటి డైరెక్టర్‌ బాధ్యతలు అప్పగించకపోడం విస్మయాని గురిచేస్తుంది. అసలు నిబంధనల ప్రకారము డైరెక్టర్స్‌ పదవీకాలం ముగిసే నెల రోజుల ముందు సెలక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వూలు నిర్వహించాలి, కానీ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ పదవీ విరమణకు పక్షం రోజుల గడువు మాత్రమే ఉన్నా నేటివరకు ఎటువంటి కమిటీ సమావేశం నిర్వహించకపోడంతో అసలు ఏం జరుగుతుంతో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఆరోపణలు ఉన్నా అప్పగించారు..

ఈఅండ్‌ఎం మేనేజ్‌మెంట్‌ ట్రైనీ 68 పోస్టులకు సంస్థ మార్చి 2020లో నిర్వహించిన రాత పరీక్షలో హైటెక్‌ విధానంలో మాస్‌ కాపీ జరిగిన విషయం అప్పట్లో పెనుదుమారమే లేపింది. ఈ ఘటనలో ఈ అధికారిపై పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ ఆధికారిపై ఆరోపణలు ఉన్నప్పటికీ సెప్టెంబర్‌ 2022 లో జరిగిన 177 క్లరికల్‌ పోస్టుల పరీక్షల సమయంలో ఈ వ్యక్తికే డైరెక్టర్‌ పా బాధ్యతలు తిరిగి అప్పగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈఅండ్‌ఎం రాత పరీక్షల అవకతవకలపై జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టిన విచారణ పూర్తి అయ్యేవరకు ఫలితాలు వెల్లడించకూడదని సూచించారు పోలీసు ఉన్నతాధికారులు. అయితే ఆ అధికారి ప్రోద్భలంతో అవేమీ పట్టించుకోకుండా ఫలితాలు విడుదల చేశారనే చర్చ సాగుతోంది. దీంతో కష్టపడి చదివిన ప్రతిభావంతులైన నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయమని ఆందోళన వ్యక్తం చేశారు.

సంస్థాగత నిర్ణయాల్లో జాప్యం

సింగరేణి సిరుల తల్లి రాష్ట్ర ప్రభుత్వానికి కల్పతరువుగా మారి తెలంగాణ కొంగు బంగారంగా పిలుచుకునే సింగరేణి సంస్థ పూర్తి స్థాయి అధికారలు లేక సంస్థాగత నిర్ణయాల్లో జాప్యం జరుగుతుందని కార్మికలోకం ఆవేదన చెందుతోంది. పర్సనల్‌, అడ్మినిస్ట్రేషన్‌, వెల్ఫేర్‌, విజిలెన్స్‌, హెచ్‌ఆర్‌డి, ఎస్టేట్‌లు, మెడికల్‌ అండ్‌ హెల్త్‌, ఎడ్యుకేషన్‌, సెక్యూరిటీ, లీగల్‌, సివిల్‌ ఇంఛార్జి. సింగరేణి కాలరీస్‌ కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ స్టోర్స్‌ ఇలా సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల సంక్షేమ సంబంధిత పనులలో పిఎడబ్ల్యూ శాఖ తీసుకునే నిర్ణయాలే కీలకంగా నిలుస్తాయి. 2014కు వరకు సంస్థలో ఐఎఎస్‌ స్థాయి ఇద్దరు అధికారులు డైరెక్టర్లుగా విధులు నిర్వహించేవారు. డైరెక్టర్‌ పా బాధ్యతలు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులను మాత్రమే నియమించడంతో సంస్థ పురోగతికి పాలనా పరమైన అంశాలలో కీల నిర్ణయాలు తీసుకునేవారు. కానీ సీఅండ్‌ఎండీగా ఎన్‌ శ్రీధర్‌ 2015లో బాధ్యతలు చేపట్టిన నాటినుండి మరో ఐఎఎస్‌ స్థాయి అధికారిని నియమించకపోడం విస్మయానికి గురిచేస్తుంది. ఉన్న అధికారులకే అదనపు బాధ్యతలు కట్టబెట్టడంతో పనిభారంతో ఏ పోస్టుకు సరైన న్యాయం చేయలేకపోతున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 2020 సెప్టెంబర్‌లో నిర్వహించిన ఇంటర్యూలలో పీఅండ్‌పీగా బి వీరారెడ్డిని ప్రభుత్వం నియమించింది. కానీ విధుల్లో చేరకుండా కోల్‌ ఇండియాలో ఈసిఎల్‌లో టెక్నికల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ పోస్టును డైరెక్టర్‌ బలరామ్‌కు ఇంచార్జీగా బాధ్యతలు అప్పగించింది సంస్థ. సకాలంలోను సరైన నిర్ణయాలు తీసుకోలేపుతున్నారని, సంస్థాగత నిర్ణయాలలో తీవ్ర జాప్యం జరుగుతుందని సింగరేణీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గనుల విస్థరణ వంటి కీల అంశాలలో అనుమతులు సైతం ఆలస్యం అవుతున్నాయని, విద్యుత్‌ సంస్థల నుండి రావాల్సిన రూ. వేల కోట్ల బకాయిల వసూళ్ళు చేయలేకపోతుందని కార్మిక సంఘాల నాయకులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా సంస్థ పూర్తిస్థాయి డైరెక్టర్లను నియమించి సిరుల తల్లి పురోగతికి పాటుపడాలని సింగరేణీయులు కోరుతున్నారు.



Next Story