ప్రజాప్రతినిధిలు ఇక్కడ.. రైలు ఎక్కడ...?

by S Gopi |
ప్రజాప్రతినిధిలు ఇక్కడ.. రైలు ఎక్కడ...?
X

ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. కానీ ఇల్లందు ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదు. రోజురోజుకు వ్యాపార వాణిజ్య సంస్థలు కనుమరుగవుతున్నాయి. వ్యాపారాలు లేక ఆంబజార్ వెలవెలబోతుంది. వ్యాపార రంగం మెరుగుపడాలంటే కచ్చితంగా రైలు సర్వీసులు ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే అభివృద్ధికి బీజం వేసినట్టు అవుతుంది. అందుకు ఉదాహరణ మహబూబాబాద్, ఖమ్మం, మధిర పట్టణాలే. రైలు మార్గం ఉన్నప్పటికీ కేవలం బొగ్గుకే పరిమితమైంది. ఈ నేపథ్యంపై దిశ ప్రత్యేక కథనం....

దిశ, ఇల్లందు: ఈ పేరు వినగానే సింగరేణికి పుట్టినిల్లుగా ముద్ర పడింది. ఒకప్పుడు పదుల సంఖ్యలో బొగ్గు బావులు, వేల సంఖ్యలో కార్మికులు ఉండేవారు. నల్ల సూర్యులతో ఇల్లందు కళకళలాడేది. వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ దర్జాగా ముందుకు సాగాయి. ప్రస్తుతం ఇల్లందు వెలవెలబోతుంది. ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రైలు సర్వీసులు తప్పనిసరి. రైల్వే సర్వీసులు కొనసాగినప్పుడు ఇల్లందు వ్యాపార రంగం పటిష్టంగా ఉండేది. ప్రస్తుతం రైల్వే సర్వీసులు లేకపోవడంతో వ్యాపార రంగం వెలవెలబోతుంది.

చరిత్రను పరిశీలిద్దాం...

ఇల్లందులో బొగ్గు తవ్వకాలు 1889లో ప్రారంభమయ్యాయి. ప్రజల సౌకర్యార్థం, బొగ్గు రవాణా కొరకు బ్రిటీష్ అధికారులు 1929లో ఇల్లందులో రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇల్లందే మొట్టమొదటి రైల్వే స్టేషన్. ఆ తరువాత కాజిపేట్, ఖమ్మం స్టేషన్ లు అవతరించాయి. నాటి నుండి 2006 వరకు రైలు సర్వీసులు కొనసాగింపబడ్డాయి. ఆ తరువాత కేవలం బొగ్గు రేకులే రవాణా జరుగుతుంది తప్ప మనుషులు ఎక్కే రైలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి.


రైల్వేకు భారీ ఆదాయం...

ఇల్లందు నుండి రైల్వే శాఖకు భారీ ఆదాయం లభిస్తుంది. సింగరేణి నుండి రోజుకు నాలుగు రేకులు రవాణా జరగడం వలన భారీగా రైల్వే శాఖ లాభాలు అర్జిస్తుంది. ఒక పక్క సింగరేణి ప్రతి ఏటా రూ. 30 కోట్లు లాభాలు సమకూర్చుకుంటుంది. సింగరేణి వలన రైల్వే శాఖకు ప్రతి ఏటా సుమారు రూ. 300 కోట్ల ఆదాయం లభిస్తుంది. ఇంత ఆదాయం కలిగిన రైల్వే ఈ ప్రాంతానికి రైలు ఎందుకు ఇవ్వడం లేదు. ప్రతినిధులు ఉన్నారు తప్ప ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో మాట్లాడిన దాఖలాలు లేవు. కనీసం ప్రయత్నం చేయడం లేదు. ఎన్నికల ముందు వాగ్ధానం ఇస్తారే తప్ప గెలిచిన తర్వాత మర్చిపోవడమే. ఫలితంగా ఇల్లందుకు తెలియకుండానే భారీగా నష్టం జరుగుతుంది. వ్యాపార, వాణిజ్య రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఒకప్పుడు ఉన్న వ్యాపార రంగం ప్రస్తుతం ఇల్లందులో కొట్టుమిట్టాడుతుంది. ప్రజలే చైతన్యమై పోరాటలకు సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే వచ్చే ఎన్నికలలో ఈ అంశం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.



Next Story

Most Viewed